మధ్యప్రదేశ్లో విషాదం: బాలుడ్ని రక్షించడానికి వెళ్లి.. బావిలో పడ్డ 30 మంది
బావిలో పడిన ఓ చిన్నారిని రక్షించడానికి వెళ్లి..దాని గోడ కూలిపోవడంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. విదిష పట్టణానికి సమీపంలో గంజ్బసోడ గ్రామంలో ఓ బాలుడి బావిలో పడిపోగా.. అతడిని రక్షించేందుకు గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో బావి గోడ కూలిపోవడంతో 30 మంది అందులో పడ్డారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలోనే ఉండి సహయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.బాలుడ్ని రక్షించేందుకు బావి దగ్గర భారీగా గుమిగూడటం వల్ల రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో 30 మంది బావిలో పడిపోగా.. 19 మందిని ఇప్పటి వరకూ బయటకు తీశారు. మరో 10 మంది అందులో చిక్కుకున్నారు. బయటకు తీసినవారిలో కొందరికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగుర్ని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందించారు. కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు. అలాగే, మంత్రి విశ్వాస్ సారంగ్ను ఘటనస్థలికి వెళ్లాలని చెప్పానని ముఖ్యమంత్రి శివ్రాజ్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.. ఆ జోన్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడకు చేరుకున్నారు... సంబంధిత అధికారులతో టచ్లో ఉన్నామని తెలిపారు. ప్రమాదంపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
By July 16, 2021 at 09:07AM
No comments