Breaking News

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేడే.. 22 మందికి ఛాన్స్.. స్మృతి ఇరానీ ఔట్?


కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి విస్తరణ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి, సమీప భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో భారీ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా 22 మంది కొత్తవారికి అవకాశం లభిస్తుందని సమాచారం. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిణామాల కారణంగా జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), సుశీల్‌కుమార్‌ మోదీ (బిహార్‌), శర్వానంద సోనోవాల్‌ (అసోం)లకు కేంద్ర కేబినెట్‌లో బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి పదవి దక్కేందుకు ఎక్కువ అవకాశాలున్న ఇలాంటివారు వరుసగా హస్తినకు చేరుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఎక్కువ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు మోదీ టీమ్‌లో యూపీ నుంచి ఉన్న 9 మందిలో నలుగురైదుగురికి స్థానచలనం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. రీటా బహుగుణ జోషికి ఛాన్స్ వస్తే అదే సామాజికవర్గానికి చెందిన నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండేకి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. యూపీ నుంచి జోషితో పాటు, అజయ్‌మిశ్ర, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌, పంకజ్‌ చౌదరి, రాంశంకర్‌ కతేరియా, వరుణ్‌గాంధీ, రాజ్‌వీర్‌సింగ్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మాయావతి, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని మంత్రివర్గం నుంచి తప్పించి, ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావు పేరు మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి దక్కినా అది ఏపీ ఖాతాలోకి వెళ్లిపోతుండటంతో మిగిలిన వారికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అవకాశం ఉన్న నేతలు వీరే... జేడీయూ లోక్‌సభాపక్ష నేత రాజీవ్‌ రంజన్‌ (లాలన్‌ సింగ్‌), ఎల్‌జేపీ నుంచి రాంవిలాస్‌ పాసవాన్‌ సోదరుడు పశుపతి కుమార్‌ పారాస్‌కు స్థానం కల్పించనున్నట్లు సమాచారం. పారాస్‌కు స్థానం కల్పించవద్దని పాసవాన్‌ తనయుడు చిరాగ్‌ ఇప్పటికే ప్రధాని మోదీని కోరారు. ఎల్‌జేపీ సభ్యులుగా ఎవరినైనా కేబినెట్‌లో తీసుకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. పరిశీలనలో ఉన్న పేర్లు..పశ్చిమ బెంగాల్‌ నుంచి దళిత నేతలు శాంతను ఠాకుర్‌, నిశిత్‌ ప్రామాణిక్‌, మహారాష్ట్ర నుంచి మరాఠా నేత నారాయణ్‌రాణే, మాజీ కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే కుమార్తె ప్రీతమ్‌ ముండే, హీనా గవిట్‌, బ్రిజేంద్ర సింగ్‌(హరియాణా), రాకేశ్‌ సింగ్‌(మధ్యప్రదేశ్‌), అశ్వినీ వైష్ణవ్‌(ఒడిశా), రాహుల్‌ కాస్వా(రాజస్థాన్‌), తీరథ్‌ సింగ్‌ రావత్‌(ఉత్తరాఖండ్‌), కర్ణాటక నుంచి ఎ.నారాయణస్వామి, రమేష్‌ జిగజినగితో పాటు, లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన మరో నేత; తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకే నుంచి ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.


By July 07, 2021 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-cabinet-expansion-on-wednesday-22-new-faces-may-be-included/articleshow/84192237.cms

No comments