Breaking News

జులై 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం.. టీకా వేసుకున్నవారికే అనుమతి


శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నెలవారీ పూజల కోసం జులై 17న తెరుచుకోనున్నాయి. నాలుగు రోజుల పాటు జులై 21 వరకు తెరిచి ఉంచే ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో కేవలం 5 వేల మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. కోవిడ్ టీకా వేసుకున్నట్టు సర్టిఫికెట్, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ముందుగా ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. 5 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. మండల, మకరవిళక్కు పూజల కాలంలో లక్షలాది మంది దర్శించుకుంటారు. కానీ, కరోనా కారణంగా గతేడాది నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. జులై 17న సాయంత్రం ఆలయాన్ని తెరిచి, ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. కోవిడ్ తొలినాళ్లలో కరోనాను సమర్ధవంతంగా కట్టడిచేసిన కేరళ.. రెండో దశలో మాత్రం నియంత్రణలో విఫలమయ్యింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. అన్ని సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. శనివారం కేరళలో 14,087 కేసులు నమోదుకాగా.. మరో 109 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళలో మొత్తం కరోనా కేసులు 30,53,116కు చేరుకోగా. మరణాల సంఖ్య 14,489కి చేరింది. ప్రస్తుతం అక్కడ 1,15,226 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


By July 11, 2021 at 06:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-ayyappa-temple-to-open-for-devotees-from-july-17-21-vaccine-rt-pcr-test-must/articleshow/84309166.cms

No comments