Breaking News

హనుమను చంపుతుంటే రాముడు మౌనంగా ఉంటాడా?.. మోదీకి యువనేత చురకలు!


పార్టీలో చీలిక విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలను టార్గెట్ చేస్తూ లోక్‌జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హనుమంతుడ్ని చంపుతున్నప్పుడు రాముడు మౌనంగా ఉండటం సరికాదు అంటూ పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను తాను హనుమంతుడిగా..ప్రధాని నరేంద్ర మోదీని రాముడిగా చిరాగ్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పార్టీలో తిరుగుబాటు అంశంపై జోక్యం చేసుకోవాలని పరోక్షంగా యువనేత మోదీని అభ్యర్థించారు. సత్యయుగం నుంచి ఇప్పటి వరకూ.. రామాయణంలో రాముడికి అన్నివేళలా హనుమంతుడు సాయంగా ఉన్నారని అన్నారు. ‘‘రాముడి ప్రతి అడుగులోనూ హనుమంతుడు నడిచాడు.. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఎల్జేపీ మద్దతుగా ఉంటోంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి నిర్ణయంపై బీజేపీ వెంట బలంగా నిలబడిన హనుమంతుడు.. ఈ రోజున ఎల్జేపీలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ పార్టీ జోక్యం చేసుకుంటుందని, ఈ విషయాన్ని ఎలాగైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నాడు.. కానీ, బీజేపీ మౌనం నాకు ఖచ్చితంగా బాధ కలిగించింది. అయినప్పటికీ, పరిస్థితిని చక్కదిద్దడం ద్వారా ఈ రాజకీయ సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రధాని జోక్యం చేసుకుంటారని ఆయన నాకు పూర్తి నమ్మకం ఉందని చెబుతున్నాను’’ అన్నారు. ఎల్జేపీలో చీలిక విషయం బీజేపీ నేతలకు తెలియకుండా జరిగుండదని రెండు రోజుల కిందటే చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, పార్టీ గుర్తుపై తనకే అధికారం ఉంటుందని పేర్కొంటూ ఎన్నికల కమిషన్‌కు చిరాగ్ లేఖ రాసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహించిన పశుపతి పరాస్.. ఎల్జేపీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీలను రద్దుచేయడంతో చిరాగ్ ఈసీకి లేఖ రాశారు. పార్టీ సంక్షోభంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ హస్తం ఉందని, ఇది బహిరంగ రహస్యమేనని చిరాగ్ పునరుద్ఘాటించారు. పార్టీని చీల్చడానికి నితీశ్ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2005 ఎన్నికల్లో తమ పార్టీ 29 సీట్లను గెలిస్తే.. అప్పుడు కూడా పార్టీని చీల్చారని, 2020లో మా పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను జేడీయూలో చేర్చుకున్నారని ఆరోపించారు.


By June 24, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ljp-chief-chirag-paswan-reaches-out-to-pm-modi-and-bjp-after-party-coup/articleshow/83798556.cms

No comments