Breaking News

Tauktae Cyclonic Strom పెను తుఫానుగా ‘తౌక్టే’.. గుజరాత్‌‌కు రెండు దశాబ్దాల తర్వాత భారీ ముప్పు


అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే ఆదివారం రాత్రి పెను తుఫానుగా మారి గుజరాత్‌వైపు పయనిస్తున్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే ఈ తుఫానుతో కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోగా, గుజరాత్‌లో పెను విధ్వంసం సృష్టించనుందని హెచ్చరించింది. తుఫాను కారణంగా ఆదివారం మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను ఉత్తర, వాయువ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకి, మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్‌- మహువా (భావ్‌నగర్ జిల్లా) ల మధ్య తీరాన్ని దాటనుందని వెల్లడించింది. సోమవార తెల్లవారుజామున 2.30 గంటల సమయానికి తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ ‘ఆరెంజ్ అలర్ట్‌’ ప్రకటించింది. తుఫాను కారణంగా ప్రచండ గాలులు వీస్తాయని, గాలి వేగం గంటకు 160-185 కి.మీ.కు పెరుగుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సోమవారం మహారాష్ట్ర తీర ప్రాంతంలో గాలి వేగం గంటకు 65-75 కి.మీ.; దుమారం వేగం గంటకు 85 కి.మీ. ఉంటుందని పేర్కొంది. ఇది క్రమంగా పెరుగుతూ గుజరాత్‌వైపు పయనిస్తుందని వివరించింది. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌, భావ్‌నగర్‌ జిల్లాల్లో గాలుల దుమారం తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. జునాగఢ్‌ జిల్లాలో సముద్ర అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడతాయని, దీవ్‌, గిర్‌సోమనాథ్‌, అమ్రేలీ, భరూచ్‌, భావ్‌నగర్‌, అహ్మదాబాద్‌, ఆనంద్‌, సూరత్‌లలో తీరప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించింది. ప్రస్తుతం తుఫాను గోవా-పనాజీకి వాయువ్యంగా 360 కిలోమీటర్లు, ముంబయికి దక్షిణంగా నైరుతి దిశలో 350 కిలోమీటర్లు, గుజరాత్‌లోని వీరావల్‌కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, డయ్యూకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణ-ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. పెను తుఫానుగా మారిన తౌక్టే.. తీరం దాటే సమయానికి కూడా అలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, భారీ గాలుల కారణంగా ఈ జిల్లాలో మట్టి ఇళ్లు పూర్తిగా కూలిపోవచ్చని, కచ్చా, పక్కా ఇళ్లకు కూడా నష్టం జరగవచ్చని అధికారులు తెలిపారు. చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయి విద్యుత్తు, సమాచార రంగాలకు అంతరాయం కలిగే ప్రమాదముంది. రైలు మార్గాలు, రహదారులపై నీరు చేరి రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ప్రాణ నష్టం జరకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ఓఖా-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైలును రద్దు చేశారు. గుజరాత్‌‌లో రెండు దశాబ్దాల తర్వాత తీరం దాటుతున్న బలమైన తుఫాను ఇదే. చివరిసారిగా 1998 జూన్‌లో వాయు తుఫాను గుజరాత్‌పై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది. నాటి తుఫానులో దాదాపు 10వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. జూన్ 9న తెల్లవారుజామున పోరబందర్ వద్ద వాయు తుఫాను తీరం దాటింది. ఆ ప్రాంతంలోని ఉప్పు కయ్యల్లో పనిచేసే కార్మికులు భారీగా మృతిచెందారు. వారికి తుఫాను గురించి సరైన సమాచారం అందకపోవడం, అధికార యంత్రాంగం వైఫల్యంతో అధిక ప్రాణనష్టం వాటిళ్లింది.


By May 17, 2021 at 07:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tauktae-now-very-severe-cyclone-set-to-rip-into-gujarat-at-185kmph/articleshow/82697200.cms

No comments