Breaking News

నేడే సీఎంగా స్టాలిన్.. తమిళపీఠాన్ని అధిష్ఠిస్తున్న తొలి వారసుడిగా రికార్డు!


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్టాలిన్‌‌తోపాటు 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. ఈ మేరకు క్యాబినెట్ జాబితాను డీఎంకే అధికారికంగా గురువారం విడుదల చేసింది. స్టాలిన్‌ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. ఆర్థికశాఖను పీడీఆర్ పళనివేల్‌ త్యాగరాజన్‌కు, ఆరోగ్యశాఖను సైదాపేట ఎమ్మెల్యే సుబ్రమణ్యంలకు అప్పగించారు. హోంశాఖను మాత్రం స్టాలిన్‌ తన వద్దే ఉంచుకొన్నారు. సీనియర్ నేత దురైమురుగన్‌కు జలవనరులు, చిన్న, భారీ తరహా నీటి ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు శాఖలకు కట్టబెట్టారు. కరోనా కారణంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం నిరాడంబరంగా జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఇది వరకే సూచించగా.. శుక్రవారం జరుగనున్న వేడుకకు కార్యకర్తలను అనుమతించట్లేదు. తనను సీఎంగా చూడాలని చాలా మంది కలలు కన్నారని.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో మాజీ సీఎంల కుమారులు ముఖ్యమంత్రులయ్యారు. అయితే, తమిళనాడులో మాత్రం ఓ మాజీ సీఎం కుమారుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. కశ్మీర్‌లో షేక్‌ అబ్దుల్లా కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన మనవడు ఉమర్‌ అబ్దుల్లా; ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ కుమార్తె మెహబూబా, ఒడిశాలో బిజూ పట్నాయక్‌ కుమారుడు నవీన్‌ పట్నాయక్, హరియాణాలో దేవీలాల్‌ కుమారుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుమారుడు అఖిలేష్‌ యాదవ్, కర్ణాటకలో దేవేగౌడ కుమారుడు కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో 1952 నుంచి పనిచేసిన ముఖ్యమంత్రుల వారసులు సీఎంలు కాలేదు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రకుమార్‌ ఎంపీగా ఉన్నారు. పళనిస్వామి కుమారుడు మిథున్‌ రాజకీయాల్లోకి రాలేదు. తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ బాధ్యతలు చేపడుతున్నారు.


By May 07, 2021 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dmk-president-mk-stalin-to-take-oath-as-tamil-nadu-cm-today/articleshow/82449061.cms

No comments