Breaking News

కరోనాతో కన్నుమూసిన మాజీ సీఎం, గవర్నర్ పహాడియా


కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులను బలితీసుకుంది. తాజాగా, కోవిడ్-19తో మరో నేత ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1980-81 మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, హరియాణా, బిహార్ గవర్నర్‌గానూ పహాడియా సేవలందించారు. నాలుగు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రెండో లోక్‌సభ ఎన్నికల్లో సవాయ్ మాదోపూర్ నుంచి తొలిసారిగా జగన్నాథ్ పహాడియా విజయం సాధించారు. జగన్నాథ్ పహాడియా కొద్ది రోజుల కిందట కరోనా బారినపడటంతో ఆయనను చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘జగన్నాథ్ పహాడియా కోవిడ్‌-19తో కన్నుమూశారు.. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఆయనకు తొలి నుంచి నాపై చాలా అభిమానం ఉండేది’’ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మరణంపై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు సంతాప దినం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని గురువారం అవనతం చేయనున్నారు. అలాగే, గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు క్యాబినెట్ సమావేశమై పహాడియాకు సంతాపం తెలియజేయనుంది. జగన్నాథ్ పహాడియా అంత్యక్రియలను గురువారం సాయంత్రం ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించనున్నారు.


By May 20, 2021 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-former-rajasthan-cm-jagannath-pahadia-dies-of-covid-19/articleshow/82788741.cms

No comments