Breaking News

కోవిడ్ సంక్షోభంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం.. కేంద్రానికి నోటీసులు


దేశంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై తీవ్రంగా స్పందించింది. దేశంలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడి పరిస్థితి అల్లకల్లోంగా మారిందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. చోద్యం చూడటం సరికాదని చురకలంటించింది. ప్రస్తుత కోవిడ్ సంక్షోభానికి సంబంధించి నాలుగు అంశాలను సుమోటాగా స్వీకరిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం పేర్కొంది. ఈ గందరగోళ పరిస్థితికి కారణాలపై పరిశీలనకు ఆరు వేర్వేరు హైకోర్టులు తమ అధికార పరిధి మేర పనిచేస్తాయని తెలిపింది. అంతేకాదు, ఇందుకు అమికస్ క్యూరీగా సీనియర్ లాయర్ హరీశ్ సాల్వేను నియమించింది. ఆక్సిజన్ కొరత, వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ, అత్యవసర ఔషధాల సరఫరా, దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్, మినీ-లాక్‌డౌన్‌ల విధింపుపై రాష్ట్రాలకున్న అధికారం ఈ నాలుగు అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. ఈ అంశాలను సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కోవిడ్-19 సన్నద్ధత ప్రణాళికపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపడతామని పేర్కొంది. పార్టీలు తమ ప్రణాళికను హైకోర్టుల ముందు కూడా కొనసాగించవచ్చని జస్టిస్ రవీంద్ర భట్ అన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం... ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశ వ్యాప్తంగా పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని, చోద్యం చూడడం సరికాదని కేంద్రంపై చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ఆక్సిజన్, ఔషధాల కొరతపై కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగానే ఈ అంశంపైనే ఢిల్లీ హైకోర్టు సైతం కేంద్రానికి చురకలంటించింది. వాస్తవికతను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని, ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రళయంగా ఉంది. రోజువారీ కేసుల్లో భారత్ కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అమెరికా ఇప్పటి వరకూ రోజువారీ కేసుల్లో తొలిస్థానంలో ఉండగా.. తాజాగా ఆ రికార్డును భారత్ అధిగమించింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 3.15 లక్షలకుపైగా కేసులు, 2వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలో మరే దేశంలోనూ రోజువారీ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నిర్ధారణ కాలేదు.


By April 22, 2021 at 01:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-says-it-will-take-suo-motu-cognisance-on-4-issues-regarding-the-current-covid-crisis/articleshow/82194859.cms

No comments