Breaking News

కరోనా ఉద్ధృతం: రెండు వారాల కఠిన లాక్‌డౌన్.. కర్ణాటకలో రేపటి నుంచి అన్నీ బంద్


కర్ణాటకలో కోవిడ్ కేసులు భారీగా నమోదుకావడంతో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కట్టడికి రెండు వారాల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజా రవాణాపై కూడా నిషేధం కొనసాగుతుందని, మంగళవారం రాత్రి 9 గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు. నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజ్ వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకలకు భారీ డిమాండ్ ఏర్పడింది.. ఊహించనిరీతిలో కోవిడ్ వ్యాప్తిచెందుతోంది.. కరోనా కట్టడిపై క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి యడియూరప్పకు కొన్ని సూచనలు, సలహాలు చేశాం... సాధారణ ప్రజల ప్రాణాలతోపాటు ఇదే సమయంలో చిరు వ్యాపారుల ప్రయోజనాలు కాపాడటం ముఖ్యం’’అని మంత్రి పేర్కొన్నారు. బెంగళూరులో కరోనా మహమ్మారి రాజ్యమేలుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో ఎక్కువ కేసులున్న ఢిల్లీ, ముంబయి నగరాలను వెనక్కు నెట్టి బెంగళూరు మొదటి స్థానానికి వచ్చింది. వైరస్‌ వ్యాప్తి, యాక్టివ్ కేసులు, మృతులు, అసౌకర్యాలు.. ఇలా.. ఏ అంశం తీసుకున్నా ఆందోళనకరంగా పరిస్థితులు ఉన్నాయి. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వైద్య సౌకర్యం లేదు. వైద్య సహాయం అందకుండానే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కర్ణాటకలో ఆదివారం 34,804 కేసులు నమోదుకాగా.. 143 మంది మహమ్మారికి బలయ్యారు. ఒక్క బెంగళూరు నగరంలోనే 20వేల కేసులు బయటపడటం గమనార్హం. దేశంలోని అత్యధికంగా యాక్టివ్ కేసులున్న నగరాల్లో బెంగళూరు ప్రస్తుతం తొలి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌నే చివరి అస్త్రంగా యడియూరప్ప ఎంచుకున్నారు.


By April 26, 2021 at 02:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-govt-announes-14-day-full-lockdown-from-tuesday-evening/articleshow/82256698.cms

No comments