Breaking News

ఇజ్రాయేల్: ఫైజర్ టీకా తీసుకున్నవారికి గుండెల్లో మంట, మయోకార్డిటిస్


గతేడాది డిసెంబర్ 19 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఇజ్రాయిల్ ఏప్రిల్ 20 నాటికి దేశ జనాభాలో దాదాపు 65 శాతం మందికి టీకాలు వేసింది. ప్రపంచంలో అత్యధికంగా టీకాల వేసిన దేశాల జాబితాలో ఇజ్రాయేల్ టాప్‌లో ఉంది. అయితే, ఫైజర్- బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశం వినియోగిస్తుండగా.. టీకా తీసుకున్న పలువురికి గుండెల్లో మంట, కండరాల వాపు వంటి సమస్యలు తలెత్తాయి. ఈ కేసులపై ఆరోగ్య విభాగం అధికారులు పరిశోధన ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ కరోనా కమిషనర్ నచ్‌మన్ యాష్ వెల్లడించారు. టీకా వేసుకున్న 62 మందిలో గుండె కండరాలు లేదా కండరాల పొరల్లో మంట లాంటి సమస్యలు తలెత్తాయని, గతవారం ఇటువంటివి 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి లక్ష మందిలో ఒకరికి ఈ పరిస్థితి తలెత్తింది. 18 నుంచి 30 ఏళ్లలోపు యువకుల్లోని ప్రతి 20వేల మందిలో ఒకరికి ఇలా జరిగిందని, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని యాష్ తెలిపారు. మరణాల రేటు లేదా గుండె కండరాల వాపు, మంట ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో కచ్చితంగా వెల్లడికాలేదని ఇజ్రాయేల్ ఆరోగ్య శాఖ ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది. ‘‘టీకా ప్రయోజనం చాలా గొప్పదిగా కనిపిస్తోంది.. కొన్ని కేసులకు వ్యాక్సిన్‌‌తో బంధం ఉన్నప్పటికీ, టీకా విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం సమర్ధనీయం కాదు’’ అని యాష్ వ్యాఖ్యానించారు. ఈ విషయమైన ఫైజర్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ అంశంపై స్పందించిన ఫైజర్.. ఇజ్రాయేల్‌లో హృదయ కండరాల వాపు (మయోకార్డిటిస్) అంశం తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేసింది. ‘‘సాధారణ జనాభాలో ఊహించిన దానికంటే ఎక్కువగా మయోకార్డిటిస్ రేటును గమనించలేదు.. సాధారణంగా వ్యాక్సిన్‌తో దీనికి సంబంధం లేదు.. వ్యాక్సిన్ వల్లే మయోకార్డిటిస్ సమస్య ఎదురయ్యిందని నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవు’’ అని పేర్కొంది.


By April 27, 2021 at 01:50PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/israel-examines-heart-inflammation-and-myocarditis-cases-after-pfizer-covid-shot/articleshow/82272214.cms

No comments