Breaking News

సొరంగం వద్ద ట్రక్కును ఢీకొట్టి పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి


తైవాన్‌లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తూర్పు తైవాన్‌లోని టొరోకో జార్జ్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 36 మంది మృతిచెందగా.. మరో 72 మంది గాయపడ్డారు. ప్రమాద సమయానికి రైల్లో మొత్తం 350 మంది ప్రయాణికులు ఉన్నారు. తైతుంగ్‌కు వెళ్తోన్న రైలు ఉత్తర హౌలైన్ సమీపంలో సొరంగం వద్ద పట్టాలు తప్పినట్టు తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు దశాబ్దాల తర్వాత జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదంగా పేర్కొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం సిబ్బంది ఘటానా స్థలికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పట్టాలు తప్పిన తర్వాత రైలు తొలి నాలుగు బోగీల్లోని 80 నుంచి 100 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఐదు నుంచి ఎనిమిదో నెంబరు బోగీల్లోని వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగు బోగిలోని ప్రయాణికులందరూ బయటపడినట్టు ఓ మహిళ తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు సొరంగం లోపల భారీ శబ్దం వచ్చినట్టు ఆమె తెలిపారు. తైవాన్ అధికారిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. సొరంగం వద్ద పట్టాల పక్కనే ఓ ట్రక్కును నిలిపి ఉంచారని, దీని వల్లే రైలు ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపింది. పట్టాలు తప్పిన రైలు పక్కనే ఓ ట్రక్కు ఉన్నట్టు ఫోటోలు, వీడియోలో కనబడుతోంది. తొలుత ట్రక్కును ఢీకొట్టిన తర్వాత రైలు పట్టాలు తప్పినట్టు ఓ వ్యక్తి వెల్లడించారు. ‘ట్రక్ తునాతునకలై పక్కకు పడిపోగా.. రైలు ముందు భాగం సొరంగం వెలుపల ఉంది.. లోపల బోగీల్లో ఉన్నవారిని వెలికితీస్తున్నట్టు తైవాన్ రైల్వే అధికారులు ప్రకటించారు. వారం రోజుల పాటు జరిగే సంప్రదాయ క్వింగ్ మింగ్ ఫెస్టివల్ ప్రారంభమైన వేళ ఈ దుర్ఘటన జరగడం బాధాకరం. తైవాన్ తూర్పు ప్రాంతంలోని పర్వతాలు పర్యాటకానికి ప్రసిద్ధి చెందాయి. ఈశాన్య తైవాన్‌ వద్ద 2018లో జరిగిన రైలు ప్రమాదంలో 18 మంది మృతిచెందగా.. మరో 175 మంది గాయపడ్డారు.


By April 02, 2021 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-36-killed-72-injured-after-taiwan-train-derails-in-tunnel/articleshow/81868300.cms

No comments