Breaking News

ఒక్క అంబులెన్స్‌లో 22 కరోనా మృతదేహాలు.. మహారాష్ట్రలో దారుణ ఘటన


ఒక అంబులెన్స్‌లో సాధారణంగా ఎన్ని మృతదేహాలు పడతాయి.. సాధారణంగా ఒకటి.. లేదా అత్యవసర పరిస్థితుల్లో రెండో మూడో మృతదేహాలు తీసుకెళ్తారు. కానీ మహారాష్ట్రలో ఒకే అంబులెన్స్‌లో ఏకంగా 22 మృతదేహాలు కుక్కి పడేశారు. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందీ ఘటన. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబజోగైలో ఉన్న స్వామి రామనంద తీర్థ్‌ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉంచిన మృతదేహాలను ఆదివారం ఇలా అమానవీయ పద్ధతుల్లో శ్మశానానికి తరలించారు. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ శివాజీ శుక్రే మంగళవారం మీడియాకు వివరణ ఇచ్చారు. మృతదేహాలను తరలించేందుకు ఆసుపత్రి యంత్రాంగం వద్ద తగినన్ని అంబులెన్స్‌లు లేవని, గతేడాది కరోనా తొలి దశ ఉద్ధృతి సమయంలో 5 అంబులెన్స్‌లు ఉండేవని, తరువాత మూడింటిని ఉపసంహరించారని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉన్న రెండు అంబులెన్స్‌లలోనే కరోనా బాధితులను, మృతదేహాలను తరలిస్తున్నట్లు వివరించారు. ‘‘కొన్ని సందర్భాల్లో కరోనా కారణంగా మరణించిన వారి బంధువులను గుర్తించడమూ కష్టంగా ఉంటోందని, లోఖాండీ సవర్‌గావ్‌ గ్రామంలో ఫ్రీజర్ లేని కారణంగా అక్కడి నుంచి కూడా మృతదేహాలను తమ కాలేజీకే పంపిస్తున్నారని శివాజీ శుక్రే తెలిపారు. తమకు మరో మూడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా గత నెల 17న జిల్లా యంత్రాంగానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై భాజపా ఎమ్మెల్సీ సురేశ్‌ దాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్, మున్సిపాలిటీ ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయన్నారు. అంబజోగై మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు అశోక్‌ సబాలే దీనిపై స్పందిస్తూ... కరోనా మృతదేహాలను శ్మశానానికి తరలించాల్సిన బాధ్యత మెడికల్ కాలేజీదేనని, తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.


By April 28, 2021 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bodies-of-22-corona-victims-stuffed-in-on-ambulance-in-maharastra/articleshow/82285029.cms

No comments