Breaking News

సమావేశంలో మాస్క్ ధరించని ప్రధాని.. రూ.14వేలు ఫైన్ వేసిన అధికారులు!


కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న నార్వే ప్రధానికి అధికారులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ప్రధాని ఆ జాబితాలో చేరారు. అధికారులతో సమావేశం సందర్భంగా మాస్క్ ధరించనందుకు థాయ్‌లాండ్ ప్రధానికి అధికారులు జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలు అంశంపై చర్చించేందుకు తన సలహాదారులతో థాయ్‌లాండ్‌ ప్రధాని జనరల్‌ ప్రయూత్‌ చాన్‌-వో-చా సోమవారం సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన మాస్క్ ధరించలేదు. ఈ విషయాన్ని బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్‌ముయాంగ్.. అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో.. ప్రధానికి 6 వేల భాట్‌ల (దాదాపు రూ.14,270) జరిమానా విధించారు. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో వైరస్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. భారత్‌ నుంచి తమ పౌరుల మినహా ఇతరులెవరూ థాయ్‌లాండ్‌ రాకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకాక్‌ మెట్రోపాలిటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిబంధనల ప్రకారం... ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్లూ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే 20,000 భాట్ల (రూ.47,610) వరకూ జరిమానా విధిస్తారు. ప్రధాని మాస్క్ ధరించని విషయంపై అధికారులకు తానే ఫిర్యాదు చేసినట్టు బ్యాంకాక్‌ గవర్నర్‌ అశ్విన్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. ‘‘బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలను ఉల్లంఘించారని నేను ప్రధానితో చెప్పాను.. రాజధానిలోని ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి... వాటిని ఉల్లంఘిస్తే 2015 వ్యాధి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 51 ప్రకారం 20,000 భాట్ వరకు జరిమానా విధించనున్నారు’’ అని గవర్నర్ అశ్విన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు విమర్శలు గుప్పించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ప్రయూత్‌కు అధికారులు జరిమానా విధించారు. కాగా, థాయ్‌ పౌరులు మినహా మిగతా వారిని తమ దేశంలోకి అనుమతించే ప్రవేశ ధ్రువీకరణ పత్రాల (సీవోఈ) మంజూరును మే 1 నుంచి రద్దు చేస్తున్నట్టు ఢిల్లీలోని థాయ్‌లాండ్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకూ వర్తిస్తుందని తెలిపింది. ఇతర దేశాల పౌరులకు మే 1 నుంచి 22 వరకు ఎటువంటి విమానా ప్రయాణ సౌకర్యాలు కల్పించబోదని స్పష్టం చేసింది. థాయ్‌లాండ్‌లో సోమవారం 2,048 కేసులు, 8 మరణాలు చోటుచేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. వరుసగా నాలుగో రోజూ రోజువారీ కేసులు 2వేలకుపైగా నమోదయ్యాయి.


By April 27, 2021 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/thailand-pm-prayut-fined-for-not-wearing-face-mask/articleshow/82269716.cms

No comments