Breaking News

మీ పెళ్లికి 10 మందే గెస్టులా.. మా ఇంట్లో డిన్నర్‌ రెడీ: పోలీస్ అధికారి వినూత్న ఆఫర్!


కరోనా కట్టడికి ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆంక్షలు, నిబంధనలను ప్రజలు గాలికొదిలేస్తున్నారు. వేడుకలు, వివాహాది శుభకార్యాలకు అతిథులు 50 మందికి మించరాదని నిబంధలు విధించినా పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ పోలీస్ అధికారి నడుం బిగించారు. వినూత్నమైన ఆలోచనతో కరోనాపై అవగాహనకు ముందుకొచ్చిన మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లా ఎస్పీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది లేదా అంత కంటే తక్కువ మంది అతిథుల నడుమ వివాహం చేసుకునే ఆ జంటకు తన ఇంటిలో విలాసవంతమైన గాలా డిన్నర్‌ ఇస్తానని ఎస్పీ మనోజ్ కుమార్ ప్రకటించారు. అంతేకాదు, ఆ జంటకు ప్రోత్సాహకంగా మెమొంటోలు కూడా ఇస్తామని, వధూవరులను తీసుకెళ్లడానికి ప్రభుత్వ వాహనాన్ని పంపిస్తామని తెలిపారు. అయితే, ఆయన ఈ ప్రకటన చేసి రెండు రోజులైనా ఈ ఆఫర్‌ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. కుర్థారా గ్రామంలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు భారీగా అతిథులు హాజరై కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. కనీసం మాస్క్ కూడా ధరించకుండా ఊరేగింపులో పాల్గొని, డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి పరిష్కారం ఏంటా అని ఆలోచించిన ఎస్పీ మనోజ్ కుమార్‌.. ఇటువంటివి పునరావృతం కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో వధూవరులకు వినూత్నమైన ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించారు. ‘‘ఏప్రిల్ 30 న వివాహం చేసుకునే రెండు జంటలు అతిథుల సంఖ్యను 10 కి పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు నాకు తెలిసింది.. వారు అలా చేస్తే నేను వారి కోసం నా ఇంటిలోనే నా కుటుంబంతో రెండు విలాసవంతమైన విందులను ఏర్పాటుచేస్తాను’’ అని ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో 12,686 మందికి కొత్తగా కొవిడ్‌ నిర్దారణ కాగా.. 88 మంది మరణించారు.


By April 27, 2021 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/give-dinner-treat-to-couples-wedding-with-10-guests-offers-madhya-pradesh-police/articleshow/82268244.cms

No comments