Breaking News

‌స్టార్ హోటల్ వేదికగా వాజే దందా.. 100 రోజులకు 12 లక్షలతో రూమ్ బుకింగ్!


ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసులను అరెస్ట్ చేయగా.. మరికొందరి పేర్లు బయటకు రావడంతో వారినీ అదుపులోకి తీసుకోనున్నాయి. ఇదే కేసులో అరెస్టయిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్‌ వాజే గురించి ఎన్ఐఏ దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబయి నారిమన్‌ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ నుంచి వాజే వసూళ్ల దందా నడిపినట్టు తాజాగా తెలిసింది. దీంతో ఈ హోటల్‌లోని 1964 నంబరు గదిపై అధికారులు దృష్టిపెట్టారు. ఆ హోటల్‌లోని 1964 నంబరు గదిని వాజే కోసం ఓ పారిశ్రామికవేత్త 100 రోజులకు మొత్తం రూ.12 లక్షలు చెల్లించి బుక్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ‘సుశాంత్‌ సదాశివ్‌ ఖామ్కర్‌’అనే పేరుతో నకిలీ ఆధార్‌ కార్డును ఉపయోగించి వాజే చెకిన్‌ అయినట్లు గుర్తించారు. విలాసవంతమైన ఈ హోటల్‌లో గదిని ఓ వ్యాపారవేత్త.. ట్రావెల్‌ ఏజెంట్‌ ద్వారా 100 రోజుల కోసం రూ. 12లక్షలు చెల్లించి బుక్‌ చేశారని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో అతడికి కొన్ని వివాదాల్లో సహకరించారని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాజే ఆ హోటల్ గదిలో కొన్ని రోజుల పాటు గడిపారని, ఆ సమయంలో ఆయన ముంబయి క్రైం బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న ఇన్నోవా వాహనంలో వచ్చిన వాజే.. ఫిబ్రవరి 20న క్రూయిజర్‌ కారులో వెళ్లిపోయారని ఆ అధికారి వివరించారు. అదే సమయంలోనే వాజే బృందం ముంబయిలోని పలు ప్రముఖ సంస్థల్లో లైసెన్స్‌ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించడం గమనార్హం. ఆ హోటల్ వద్ద వాజే కన్పించిన ఆ రెండు వాహనాలను ఇప్పటికే ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. కాగా, అంబానీ బెదిరింపుల కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. గురువారం దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌, క్లబ్‌తో పాటు థాణె జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోనూ సోదాలు నిర్వహించింది. అలాగే, ముంబయి ఎయిర్‌పోర్టులో వాజే సన్నిహితురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. థాణెలో అపార్ట్‌మెంట్‌ ఆ మహిళ పేరు మీదే ఉండటంతో ఆమెతో వాజేకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసులో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు మొత్తం 35 మంది పోలీస్ అధికారులను ఎన్ఐఏ విచారించింది. వారి నుంచి స్టేట్‌మెంట్‌లను నమోదుచేసింది. ఇప్పటి వరకు 7 కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరో మెర్సిడెస్‌ కారును కూడా ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని వాహనాలకు ముంబయి నగర పోలీస్‌ కమిషనరేట్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది. ‘వాజే ‘వ్యాపారం’ గురించి సీనియర్‌ పోలీసు అధికారుల్లో చాలా మందికి తెలుసు... దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. వారిని ఇప్పటి కప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని మరో అధికారి అన్నారు.


By April 03, 2021 at 02:03PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ambani-threat-arrested-cop-sachin-waze-extortion-racket-from-mumbai-five-star-hotel/articleshow/81885059.cms

No comments