Breaking News

కశ్మీర్‌: షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ముష్కరమూకల భరతం పట్టింది సైన్యం. షోపియాన్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య మనిహాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే నిఘా వర్గాల నుంచి సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌‌లో పాల్గొన్నారు. సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. వదంతలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అంతర్జాల సేవలను నిలిపివేశారు.


By March 22, 2021 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-terrorists-killed-in-jammu-and-kashmirs-shopian-encounter/articleshow/81626612.cms

No comments