Breaking News

హిరేన్ హత్యకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోనే కుట్ర.. ప్లాన్ బయటపెడతాడనే భయంతో!


ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. వాహనం యజమాని అనుమానాస్పద మృతిలో మరో మాజీ పోలీస్ అధికారిని యాంటీ టెర్రరిజమ్ స్క్యాడ్ (ఏటీఎస్) ఆదివారం అదుపులోకి తీసుకుంది. చోటా రాజన్ అనుచరుడు రామ్ లఖన్ భయ్యా నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా తేలిన కానిస్టేబుల్ వినాయక్ షిండే (55), బుకీ నరేశ్ రామ్‌నికాల్ గోరే (31)లను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారణ అయి జైలు శిక్ష అనుభవిస్తోన్న వినాయక్ షిండే ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు. గతేడాది మే నుంచి పెరోల్‌పై బయట ఉన్న వినాయక్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేతో కలిసి పనిచేశాడు. మన్‌సుఖ్ హిరేన్ మరణం వెనుక మరి కొంత మంది పోలీసుల పాత్ర ఉందని ఏటీఎస్ అనుమానిస్తోంది. హిరేన్‌ను హత్యకు వాజే ఆదేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. మన్‌సుఖ్‌తో వాజే, మరికొందరు పోలీసులు సంభాషించినట్టు ఏటీఎస్ డిజిటల్ ఆధారాలు సేకరించింది. గోరే, షిండేలను థానే ఏటీఎస్ కోర్టులో ప్రవేశపెట్టగా.. మార్చి 30 వరకు వారిని పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఏటీఎస్ చీఫ్ జైజీత్ సింగ్ మాట్లాడుతూ.. పెరోల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి వాజేతో షిండే టచ్‌లో ఉన్నాడని, బుకీ గోరే అతడికి ఐదు సిమ్ కార్డులను ఇచ్చాడని అన్నారు. వీరి ఆరెస్ట్‌తో మరింత సమాచారం వెల్లడవుతుందని భావిస్తున్నారు. అలాగే, ఈ ఘటనలో చాలా మంది పాత్ర బయటకు వస్తుందని, వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో వాహనాన్ని నిలపాలని మన్‌సుఖ్‌ను వాజే కోరినా.. అందుకు అతడు నిరాకరించాడని అధికారులు పేర్కొన్నారు. ‘వాజే ఈ కేసు చేధించి మరింత గుర్తింపు పొందడం లేదా తన సీనియర్ అధికారి సహా మరికొందరు పోలీసులు కలిసి ఒక కార్పొరేట్ ప్రారంభిస్తున్న ప్రైవేట్ భద్రతా సంస్థలోకి ప్రవేశించాలని ఆశించారు’ అని అన్నారు. ‘మన్‌సుఖ్‌ను వాజే అడ్డు తొలగించినట్లు ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి.. ఎందుకంటే తరువాతి ఒత్తిడికి గురయి తన ప్లాన్‌ను బయటపెడతాడని భయపడ్డారు’ అని వివరించారు. ‘మార్చి 2 న క్రాఫ్‌ఫోర్డ్ మార్కెట్ సమీపంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు సహచరులతో వాజే రెండు గంటల పాటు సమావేశం నిర్వహించి మన్‌సుఖ్‌ను చంపడానికి పథకం వేశారు. అదే రోజు తాను పోలీసులు, మీడియా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాని ఆరోపిస్తూ లేఖను ఒక లాయర్ ద్వారా విడుదల చేయాలని హిరేన్‌ను ఆదేశించాడు’ అని పేర్కొన్నారు.


By March 22, 2021 at 09:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fake-encounter-police-and-bookie-held-by-ats-for-killing-hiran-on-waze-order/articleshow/81625569.cms

No comments