Breaking News

‘చావు కబురు చల్లగా’ ట్విట్టర్ రివ్యూ: సినిమాలో సరుకుంది.. కానీ!


కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. ఇప్పటి వరకు పోషించని పాత్రలో కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నారు. శవాల బండికి డ్రైవర్‌గా, బస్తీ బాలరాజుగా కార్తికేయ నటించారు. అలాగే, లావణ్య త్రిపాఠి కూడా వితంతువు పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా షోలు మొదలుకాలేదు. అయితే, ఓవర్సీస్‌లో ఇప్పటికే ‘చావు కబురు చల్లగా’ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ ఈ సినిమా చూసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే యావరేజ్ టాక్ వినిపిస్తోంది. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది కానీ కథనం మాత్రం చాలా రొటీన్‌గా ఉందని అంటున్నారు. కాస్త కామెడీతో ఫస్టాఫ్ టైమ్ పాస్‌ అవుతుందని.. సెకండాఫ్ మాత్రం పెద్దగా ఏమీ లేదని టాక్. బస్తీ బాలరాజు క్యారెక్టరైజేషన్, కార్తికేయ నటన సినిమాకు ప్లస్ అని అంటున్నారు. బస్తీ బాలరాజు క్యారెక్టరైజేషన్ పూరి జగన్నాథ్ హీరోలను గుర్తుకు తెస్తుందని అభిప్రాయపడుతున్నారు. కార్తికేయ పెర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ పాయింట్లట. సినిమా కథలో బలమున్నా దర్శకుడు స్క్రీన్‌ప్లేను శక్తివంతంగా రాసుకోలేకపోయారనేది విమర్శ. స్క్రీన్‌ప్లే చాలా రొటీన్‌గా, బోరింగ్‌గా ఉందని అంటున్నారు. స్క్రీన్‌ప్లే బలంగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని టాక్. ఇక అనసూయ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. సాయంత్రానికి ఇది ఎలా మారుతుందో చూడాలి!


By March 19, 2021 at 08:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chaavu-kaburu-challaga-movie-twitter-review-and-audience-response/articleshow/81580763.cms

No comments