Breaking News

‘మీరు నన్ను మిస్ అవుతున్నారా’.. ఓ వేడుకలో ట్రంప్ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం!


ఈ ఏడాది జనవరి 20న శ్వేతసౌధం వీడిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు తొలిసారిగా శనివారం బయట ప్రపంచానికి దర్శనమిచ్చారు. ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో రిసార్టులో శనివారం రాత్రి జరిగిన తన స్నేహితుడి వివాహ వేడుకకు ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జంటకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘మీరు నన్ను మిస్ అవుతున్నారా’ అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలకు దిగారు. ట్రంప్ మాట్లాడిన ఈ వీడియోను ప్రముఖ గాసిప్ సైట్ టీఎమ్‌జెడ్‌ పోస్ట్ చేసింది. బిజినెస్ ఇన్‌సైడర్ కథనం ప్రకారం.. తన చిరకాల మిత్రులు మేగాన్ నోడరర్, జాన్ అరిగో వివాహానికి హాజరైన అతిథుల నుంచి మాజీ అధ్యక్షుడి ప్రశ్నకు విశేష స్పందన లభించింది. కాగా, ఈ సందర్భాన్ని జో బైడెన్‌ యంత్రాంగం నిర్ణయాలపై దాడికి ట్రంప్ వినియోగించుకున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దులు, చైనా, ఇరాన్ సహా పలు అంశాలపై ట్రంప్ మాజీ అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. ‘పిల్లలకు ఏమి జరుగుతోంది? వారు దుర్భరంగా జీవిస్తున్నారు.. వాళ్ల భవిష్యత్తును ఎవ్వరూ పట్టించుకోవడంలేదు’ అంటూ అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో పరిస్థితి గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మైనర్ బాలలు సహా వలసవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సరిహద్దు వద్ద ఉన్న కుటుంబాలను విభజించడం, కొంత మంది విమర్శకులు ‘బోను’గా అభివర్ణించిన వాటిలో పిల్లలను ఉంచడంపై ట్రంప్ యంత్రాంగం విమర్శలను ఎదుర్కొంది. ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై తాను చేసిన న్యాయపోరాటం విఫలమయ్యిందని పేర్కొన్నారు. తన ప్రసంగం చివరిలో కొత్త జంటపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘మీది చాలా అందమైన జంట’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.


By March 30, 2021 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-former-president-donald-trump-talks-about-himself-in-speech-at-couples-wedding/articleshow/81751656.cms

No comments