Breaking News

భారీగా పెరుగుతున్న కేసులు: త్వరలో లాక్‌డౌన్.. మహారాష్ట్ర మంత్రి సంకేతాలు


మహారాష్ట్రలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం అక్కడ 11,141 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. 142 రోజులు తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం అధికార యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తోంది. అటు, దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలోనూ 131 రోజులు తర్వాత 1,300కిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలపై ముంబయి ఇంఛార్జ్ మంత్రి అస్లామ్ షేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో వారం పది రోజుల్లో వైరస్ నియంత్రణలోకి రాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్ విధిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసుల గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశానికి ముందు ప్రజారోగ్య విభాగం ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ సమయంలోనే పాక్షిక లాక్‌డౌన్ అంశం చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు మళ్లీ లక్ష (97,983)కు చేరువవుతున్నాయి. ముంబయిలో ప్రస్తుతం 9,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుత పెరుగుదల ఇలాగే కొనసాగితే ఏప్రిల్ నాటికి మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 2 లక్షల దాటుతాయని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు కారణాలను విశ్లేషించేందుకు కేంద్ర బృందం త్వరలో పర్యటించనుంది. ‘స్థానిక లాక్‌డౌన్‌లు ఓ జిల్లాకే పరిమితం.. ఒక జిల్లా నుంచి మరో ప్రాంతానికి ప్రజా రవాణా ద్వారా ప్రజలు ప్రయాణిస్తారు కాబట్టి ఇవి అంత ప్రభావం చూపవు.. ఏదైనా నిర్ణయం తీసుకోడానికి ముందు వచ్చే రెండు వారాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తాం’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలోని కరోనా పాజిటివ్ రేటు వారం రోజుల్లో 11 శాతం పెరిగింది. 16 జిల్లాల్లో పాజిటివిటీ రేటు రాష్ట్ర సగటు కంటే అత్యధికంగా ఉంది. మరఠ్వాడ ప్రాంతంలోని ఔరంగాబాద్ జిల్లాలో అత్యధికంగా 24 శాతం, విదర్భలోని అకోలాలో 23 శాతం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అటు, ముంబయి పరిసరాల్లో 7.6 శాతంగా ఉన్నట్టు నివేదకను క్యాబినెట్ ముందుంచారు. మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22,19,727కి చేరుకోగా.. మొత్తం 52,478 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు రెండు రోజులతో పోల్చితే మరణాల సంఖ్య కొంత తగ్గింది. అక్టోబరు 24న ముంబయిలో 1,470 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత తగ్గూతు వచ్చాయి. కానీ, ప్రస్తుతం అదేస్థాయిలో కొత్త కేసులు నమోదుకావడం కవలరానికి గురిచేస్తోంది.


By March 08, 2021 at 12:53PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-cases-raised-maharashtra-minister-hints-at-partial-lockdown-soon/articleshow/81389319.cms

No comments