Breaking News

బైక్‌పైనే స్కూల్.. లైబ్రరీ.. ఉపాధ్యాయుడి వినూత్న ప్రయోగానికి ప్రశంసలు


కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించడంతో విద్యా సంస్థలు మూతపడటంతో లక్షలాది మంది చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకుంది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా ఇంటర్నెట్ సౌకర్యం, ఆర్ధిక స్థోమతలేని గ్రామీణ, మూరుమూల ప్రాంతాల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. స్మార్ట్‌ఫోన్‌లు కొనే శక్తి లేకపోవడంతో చాలా మంది చదువుకు దూరమయ్యారు. అటు, ప్రయివేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు కూడా మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభంతో వీధినపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను ఆదుకుని, వారిల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్నంగా విద్యార్థులకు సహకరిస్తున్నారు. పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు కొని ఇవ్వడమే కాదు, తనకున్న పరిమిత వనరులతో పుస్తకాలు వారికోసం అందుబాటులోకి తేవడం పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. సాగర్ జిల్లాకు చెందిన శ్రీవాస్తవ అనే ఉపాధ్యాయుడు తన స్కూటర్‌పై మినీ లైబ్రరీని ఏర్పాటు చేసి, వివిధ గ్రామాల్లోని విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. చాలా మంది పేద విద్యార్థులే కావడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లు కొనే స్థోమత లేక ఆన్‌లైన్ విద్యకు దూరమయ్యారు.. అందుకే తానీ నిర్ణయం తీసుకున్నానని ఉపాధ్యాయుడు శ్రీవాస్తవ్ తెలిపారు. అంతేకాదు, మొబైల్ నెట్‌వర్క్ సమస్య కూడా ఉండటంతో వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు కొని ఇచ్చానని అన్నారు. అలాగే పుస్తకాలు కొనుక్కోలేనివారి కోసం లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివరించారు. తన మినీ లైబ్రరీలోని పుస్తకాలను 2-3 రోజులు ఉంచుకోవచ్చని తెలిపారు. ఏది ఏమైనా పిల్లలు చదువుకోవడమే తన అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. పిల్లలు చదువు కోసం ఆయన చూపిన చొరవకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి గురుశిష్యుల అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.


By March 29, 2021 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/government-teacher-made-a-moving-library-at-his-scooter-in-madhya-pradesh/articleshow/81743307.cms

No comments