Breaking News

వారం రోజులుగా శ్రమిస్తోన్న సిబ్బంది.. రెండు అంగుళాలు కదిలిన భారీ నౌక!


సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకుపోయిన భారీ నౌక బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మార్చి 23 నుంచి నౌకను బయటకు తీయడానికి చాలా మంది కష్టపడుతున్నారు. వారం రోజులకు నౌక స్వల్పంగా రెండు అంగుళాల మేర కదిలింది. దీంతో కాలువలోని ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న నౌకల్లోని సిబ్బంది సంతోషంతో హారన్లను మోగించారు. ఇప్పటికే పలు టగ్‌ బోట్లు దాన్ని బయటికి లాగేందుకు యత్నిస్తుండగా.. తాజాగా మరో రెండు పడవలు కూడా కాలువకు బయలుదేరాయి. ఓవైపు నౌక కూరుకుపోయిన ఒడ్డున ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ టగ్‌ పడవలు నౌకను తాళ్లతో బయటికి లాగేందుకు ప్రయత్నిస్తాయని ఎవర్ గివెన్ నిర్వహణ బాధ్యతలు చూసే బెర్న్‌హర్డ్‌ షుల్టే తెలిపింది. నౌక అడ్డంగా చిక్కుకుపోవడానికి బలమైన గాలులు మాత్రమే కారణం కాకపోవచ్చని, నౌకలో సాంకేతిక సమస్య లేదా సిబ్బంది పొరపాటు కూడా జరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సూయజ్‌ కాల్వలో నౌకల రద్దీ మరింతగా పెరిగింది. మ్యాక్సార్‌ టెక్నాలజీస్‌ సంస్థకు చెందిన ఉపగ్రహాలు తీసిన ఫొటోల్లో ఈ విషయం వెల్లడైంది. కాలువకు దిగువన సుమారు 120కు పైగా నౌకలు లంగరు వేసి వేచిచూస్తున్నట్లు తేలింది. మొత్తంగా 450 నౌకలు కాలువలోకి ప్రవేశించేందుకు లేదా బయటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాయని అంచనా వేస్తున్నారు. సూయజ్ కాల్వలో సహాయక చర్యలు కొనసాగుతుండటంతో నౌకలు వేరే మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నాయి. ఆఫ్రికా మీదుగా సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు 18 మీటర్ల లోతుకు వెళ్లి 27వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వితీశారు. అటు, మంగళవారంలోగా నౌక సహాయక చర్యల్లో ఎటువంటి పురోగతిలేకుంటే అందులోని కంటెయినర్లను కిందకు దింపాలని ఈజిప్టు గడువు విధించింది. నౌక ముందు భాగం దెబ్బతినగా, మిగిలిన భాగం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.


By March 29, 2021 at 10:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/giant-ship-ever-given-stuck-for-days-in-suez-canal-floats-again-report/articleshow/81742913.cms

No comments