Breaking News

బయటపడిన పేపర్ లీకేజ్ వ్యవహారం.. సైనిక నియామక పరీక్షను రద్దచేసిన ఆర్మీ


ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల నియామకానికి దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన పరీక్ష రద్దయ్యింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే రద్దు చేయడం గమనార్హం. జనరల్‌ డ్యూటీ సిబ్బంది నియామకానికి దేశవ్యాప్తంగా రాత పరీక్షను ఆదివారం నిర్వహించాల్సి ఉంది. అయితే, పరీక్ష ప్రారంభానికి గంట ముందు ముగ్గురు నిందితులు పట్టుబడటంతో లీకేజ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో పరీక్షను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష 11 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా, 10 గంటలప్పుడు పుణేలో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల మొబైల్‌ ఫోన్లలో ప్రశ్నపత్రం వివరాలను పోలీసులు గుర్తించినట్టు పుణె పోలీస్‌ కమిషనర్‌ అమితాబ్‌ గుప్తా తెలిపారు. వారి వద్ద లభించిన వివరాలను అసలు ప్రశ్నపత్రంతో పోల్చిచూడగా రెండూ ఒకటేనని తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పరీక్షను రద్దుచేసినట్లు ప్రకటించారు. సైనికుల నియామకాలకు (జనరల్‌ డ్యూటీ) రూపొందించిన ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు మహారాష్ట్ర పోలీసుల సహకారంతో నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్‌లో గుర్తించామని ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు. సరైన అభ్యర్థుల ఎంపిక కోసం నియామక ప్రక్రియలో అక్రమాలు, అవినీతి విధానాలను భారత సైన్యం ఎప్పుడూ సహించబోదని అధికారులు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు శనివారం రాత్రి తమకు అందిన సమాచారం మేరకు పుణే పోలీసుల సహకారంతో ఆపరేషన్ నిర్వహించామని అన్నారు. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆర్మీ జనరల్ డ్యూటీ సిబ్బంది నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గతేడాది విడుదల చేయగా.. కరోనా కారణంగా పరీక్ష వాయిదా పడింది. ఈ ఉద్యోగాలకు 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఇక, చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు.


By March 01, 2021 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/army-recruitment-exam-cancelled-pan-india-after-paper-found-leaked-in-maharashtra/articleshow/81265059.cms

No comments