Breaking News

ఒకేసారి 3,229 జంటలకు వివాహం.. హాజరైన సీఎం.. గిన్నీస్ రికార్డుల్లోకి


చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 3,229 జంటలకు ప్రభుత్వం వివాహాలు జరిపించింది. ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సామూహిక వివాహాలు గిన్నీస్ వరల్డ్ రికార్డు‌ల్లోకి ఎక్కాయి. రాయపూర్‌లో జరిగిన సామూహిక వివాహా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం.. వారికి శుభాకాంక్షలు అందజేశారు. రాయ్‌పూర్‌లో 233 మంది జంటలకు వివాహం జరిపించారు. ముస్లిం, క్రైస్తవ జంటలు సైతం వారివారి ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకున్నారు. నూతన దంపతులకు ప్రభుత్వం తరఫున కానుకలు, రూ.1,000 నగదును సీఎం అందజేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒక్కటైన జంటలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. కొత్త దంపతులకు రాయ్‌పూర్‌కు చెందిన కమలేశ్ చోప్రా అనే వ్యక్తి వంటపాత్రలు, అంకిత్ గాంధీ అనే వ్యక్తి చేతిగడియారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి భూపేశ్ సత్కరించారు. చత్తీస్‌గఢ్‌లోని 22 జిల్లాల్లో మొత్తం 3,229 జంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలను జరిపించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం ఇదే తొలిసారి కాగా.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరింది. కొత్త జంటలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి బాఘేల్ మాట్లాడుతూ.. ‘పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున వధూవరులు వివాహంతో ఒక్కటయ్యారు. ఒకేసారి 'బారతి' 'ఘరతి' రెండూ అయ్యే అవకాశం లభించడం మన భాగ్యం. 'కన్యాదానం' కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు.. మాఘ పౌర్ణమి రోజున చేసినప్పుడు దీనికి మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఉంది’ అని అన్నారు. వివాహం కోసం చాలా మంది అనవసరమైన ఖర్చు చేస్తారని, కాలక్రమేణా చాలా వ్యర్థాలు తయారవుతున్నాయని వ్యాఖ్యానించారు. సామూహిక వివాహాల కోసం వధూవరులు, వారి కుటుంబాలు ముందుకు రావడం శుభపరిణామని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నానని అన్నారు.


By March 01, 2021 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-mass-marriages-of-3229-in-recorded-golden-book-of-world-records/articleshow/81267842.cms

No comments