Breaking News

లంచాలు తీసుకుని సైనిక ఉద్యోగాలు.. విశాఖ సహా 13 నగరాల్లో బయటపడ్డ బాగోతం


భారత సైన్యంలో ఉన్నతాధికారులే లంచాలు తీసుకుని, ఉద్యోగ నియమాకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ద్వారా సైనికాధికారులు, ఇతర ర్యాంకు ఉద్యోగాల నియామక ప్రక్రియలో అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. కొంతమంది సైనికోద్యోగులు కలిసి ముఠాగా ఏర్పడి అక్రమాలకు తెరలేపారు. వీరి మూలాలు విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మొత్తం 13 నగరాల్లో బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదుచేసిన సీబీఐ.. 23 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 17 మంది సైనికాధికారులు కాగా ఆరుగురు లెఫ్టినెంట్ కల్నళ్లు, ఇద్దరు మేజర్లు కావడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం సహా 13 నగరాల్లో సీబీఐ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. కపూర్తల, బటిండా, ఢిల్లీ, కైతాల్‌, పల్వాల్‌, లక్నో, బరేలి, గోరఖ్‌పూర్‌, జైపూర్‌, గువాహటి, జోర్హాట్‌, చిరంగాన్‌‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఆ నగరాల్లో ఉన్న ఆర్మీ బేస్‌ హాస్పిటల్స్, కంటోన్మెంట్‌, ఇతర సైనిక సంస్థలు సహా మొత్తం 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌కు చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎంవీఎస్‌ఎన్‌ఏ భగవాన్‌‌ను ప్రధాన సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. ఆయన ప్రస్తుతం స్టడీ లీవ్‌పై విశాఖపట్నంలో ఉంటున్నారని పేర్కొంది. ఢిల్లీ కంటోన్మెంట్‌ బేస్‌ ఆసుపత్రిలో పనిచేసే నాయబ్‌ కులదీప్‌ సింగ్‌ నుంచి అభ్యర్థుల తరఫున లంచాలు తీసుకుని సర్వీసు సెలక్షన్‌ బోర్డులో వారిని కల్నల్ భగవాన్ ఎంపిక చేసినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 21న కులదీప్‌సింగ్‌ నుంచి ఓ ప్యాక్‌ను భగవాన్‌ తీసుకుంటున్న వీడియో సీబీఐకి లభించిందని తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి హవల్దార్‌ పవన్‌కుమార్‌ కుమారుడ్ని, లెఫ్టినెంట్‌ నవజ్యోత్‌ సింగ్‌ను ఎంపిక చేసినందుకు భారీగా డబ్బు తీసుకున్నట్టు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నార్త్‌ కపూర్తలలోని సర్వీస్‌ సెలక్షన్‌ సెంటర్‌ ఆర్టిలరీ రెజిమెంట్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సురేందర్‌ సింగ్‌, బరేలిలోని డివిజన్‌ ఆర్డినెన్స్‌ యూనిట్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ వై.ఎస్‌.చౌహన్‌, ఢిల్లీ డీజీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్ జాయింట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సుఖదేవ్‌ అరోరా, బెంగళూరు సెలెక్షన్‌ సెంటర్‌ సౌత్‌ జీటీవో లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌లను నిందితులుగా పేర్కొంది. వీరితోపాటు పలువురు నాయిబ్ సుబేదార్లు, హవల్దార్లు, సైనికులు, లంచాలిచ్చి ఎంపికైన అధికారులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. సంయుక్త విచారణలో భాగంగా వీరికి సీబీఐ నోటీసులు జారీచేయనుంది. రాబోయే రోజుల్లో వీరిని విచారించనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై శాఖాపరమైన అంతర్గత విచారణ జరిపి నివేదికను ఆర్మీ అందజేసింది. అధికారుల కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో వేర్వేరు వ్యక్తులు భారీ మొత్తంలో డిపాజిట్ చేసినట్టు గుర్తించారు. కొన్ని ఖాతాల్లో రూ.50 లక్షలకుపైగా నగదు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ వీకే పురోహిత్ మార్చి 13న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేశారు. అంతకు ముందు, ఫిబ్రవరి 28న ఆర్మీ విభాగాల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. సర్వీస్ సెలక్షన్ బోర్డులోని అధికారులు లంచాలు తీసుకుని, ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ బేస్ ఆస్పత్రిలో మెడికల్ రివ్యూ పేరుతో అభ్యర్థులను తాత్కాలికంగా రిజక్ట్ చేసినట్టు తెలిపారు.


By March 16, 2021 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cbi-books-23-person-including-6-lieutenant-colonels-2-majors-in-army-recruitment-scam/articleshow/81522720.cms

No comments