KCR బాటలో దీదీ.. ఐదు రూపాయల పథకం ఓట్లు కురిపిస్తుందా..?
త్వరలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాషాయ పార్టీని ఢీ కొట్టడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలను దీదీ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మళ్లీ అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డొతున్న మమతా బెనర్జీ.. ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే పేదలకు రూ.5కే భోజనం అందించే పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ పథకానికి ‘మా (అమ్మ) క్యాంటీన్’ అని పేరు పెట్టారు. హైదరాబాద్ నగరంలో రూ.5కే పేదలకు భోజనం అందిస్తోన్న సంగతి తెలిసిందే. భాగ్యనగరంలో విశేష ఆదరణ పొందిన ఈ పథకాన్ని దీదీ బెంగాల్లో అమలు చేస్తున్నారు. ఇంట్లో వారందరికీ అమ్మ అన్నం పెడుతున్నట్లుగానే.. పేదలకు, అన్నార్థులకు రూ.5కే భోజనం పెట్టేందుకు ‘మా ప్రాజెక్టు’ను మమతా బెనర్జీ ప్రారంభించారు. రూ.5కే అందించే భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు కూరను వడ్డించనున్నారు. త్వరలోనే బెంగాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఈ క్యాంటీన్లు తెరిచి ఉంటాయి. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించారు. అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ శాఖల సహకారంతో స్వయం సహాయకవ బృందాలు ఈ క్యాంటీన్లను నిర్వహిస్తాయి. కర్ణాటక ఎన్నికల ముందు సిద్ధరామయ్య సర్కరు ఇందిర క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ్లలో భోజనం అందిస్తారు. తక్కువ ధరకే పేదల కడుపు నింపే ఇందిర క్యాంటీన్లు విశేష ఆదరణ పొందాయి. భాగ్యనగరంలో రూ.5కే మధ్యాహ్న భోజనం అందిస్తోన్న అన్నపూర్ణ పథకానికి హరే కృష్ణ ఫౌండేషన్ తోడ్పాటునందిస్తోంది.
By February 17, 2021 at 01:14PM
No comments