Breaking News

రేపటి నుంచి ప్రయివేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ టీకా.. ధర ఎంతంటే?


మార్చి 1 నుంచి దేశంలో మూడో దశ ప్రారంభం కానుంది. ఈ దశలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 45 ఏళ్లు దాటిన వారికి టీకా అందజేయనున్నారు. ఉప ఆరోగ్యకేంద్రాలు మినహా మిగితా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీకా అందజేయనున్నారు. కొవిన్‌ 2.0 యాప్‌లో శనివారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మ్యాపింగ్‌ జరుగుతోంది. ప్రయివేట్ ఆస్పత్రుల్లో సర్వీసు ఛార్జీలతో కలిసి రూ.250కి టీకా అందుబాటులో ఉంటుంది. ప్రయివేట్ ఆసుపత్రులకూ వైద్యారోగ్యశాఖే టీకా సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఒక వయల్‌తో 10 మందికి టీకా ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియలో టీకా వృథా కాకుండా అధికారులు ప్రత్యేకదృష్టి పెట్టారు. ప్రస్తుతం సీరం సంస్థ కొవీషీల్డ్‌ ఒక్కో డోస్‌కు రూ.200, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కు రూ.295 కేంద్రం చెల్లిస్తోంది. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాను ఉచితంగా అందజేయనున్నారు. మూడో దశతో కలిపి మొత్తం 27 కోట్ల మందికి టీకా అందజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన డోస్‌లను ప్రయివేట్ ఆస్పత్రులకు ఆయా ప్రభుత్వలు పంపిణీ చేయనున్నాయి. జాతీయ ఆరోగ్య యంత్రాంగం ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలో నగదును ప్రయివేట్ ఆస్పత్రులు డిపాజిట్ చేయనున్నాయి. మూడో దశలో ప్రయివేట్ ఆస్పత్రులను భాగస్వామ్యులను చేసి, టీకా పంపిణీ వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను మాత్రమే ప్రయివేట్ ఆస్పత్రులకు సరఫరా చేయనున్నారు. ఎందుకంటే కొవాగ్జిన్‌తో పోల్చితే కొవీషీల్డ్ డోస్‌లు ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉండటమే కారణం. కేంద్ర ప్రభుత్వం, టీకా ఉత్పత్తి సంస్థలు, ప్రయివేట్ ఆస్పత్రి యాజమాన్యాల మధ్య పలు దశల చర్చల అనంతరం టీకా ధరపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 10వేల ప్రయివేట్ ఆస్పత్రులు, సెంట్రల్ గవర్న్‌మెంట్ హెల్త్ స్కీమ్ కింద మరో 600 ప్రయివేట్ ఆస్పత్రులు సహా రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాలను అమలు చేసే ఆస్పత్రుల్లో టీకాను అందజేయనున్నారు.


By February 28, 2021 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-vaccine-price-to-be-capped-at-r-250/-dose-at-private-hospitals/articleshow/81252566.cms

No comments