Breaking News

ముగిసిన రామమందిర విరాళాల సేకరణ: కళ్లు చెదిరే ఆదాయం.. ఎన్ని వేల కోట్లంటే?


అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ ఫిబ్రవరి 27తో ముగిసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ విరాళాల సేకరణ 44 రోజుల పాటు నిరాటంకంగా సాగింది. రామమందిర విరాళాల సేకరణ శనివారంతో ముగిసినట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. రామ మందిరం కోసం రూ.2 వేల కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని ట్రస్టు వర్గాలు తెలిపాయి. అయితే, చాలా నగదును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే విరాళాల మొత్తం పెరిగే అవకాశముందని పేర్కొన్నాయి. విరాళాల ద్వారా అందిన మొత్తంపై ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉందని ట్రస్టు కార్యాలయం ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. అందుకోసం ఓ యాప్ ను కూడా రూపొందించామని, ఈ ప్రక్రియలో పాల్గొనేవారు ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి, ప్రతిరోజూ డేటాను యాప్ లో పొందుపరచాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ నెలరోజుల పాటు సాగనుందని చెప్పారు. పలు చెక్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, మూడు రోజులు సెలవు కావడంతో నగదు డిపాజిట్‌లు నిలిచిపోయాయని తెలిపారు. వాలంటీర్ల వద్ద ఉన్న మిగతా కూపన్లను వెనక్కు తీసుకుంటామని పేర్కొన్నారు. విరాళాలపై వీహెచ్ఫీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడుతూ.. శ్రీ రామ్ మందిర్ నిధి సమర్పన్ అభియాన్ జనవరి 15 న పవిత్రమైన మకర సంక్రాంతి రోజున ప్రారంభమైంది. ఐదు లక్షల గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లక్షలాది వాలంటీర్ బృందాలు నిర్విరామంగా పనిచేశాయి. దేశ జనాభాలో సగం మందిని కలుసుకున్నారు. సేకరించిన విరాళాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక శాఖలలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. సంబంధిత రశీదులు లేదా కూపన్ నంబర్లతో కూడిన సేకరణ వివరాలు మొబైల్ కోసం ప్రత్యేకంగా రూపొందించాం’ అన్నారు. విరాళాల సేకరణ పారదర్శకంగా సాగిందని తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక బృందం డెవలప్‌‌చేసిన యాప్ ద్వారా మొత్తం ప్రక్రియ జరిగింది అని అన్నారు.


By February 28, 2021 at 01:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ram-temple-donation-campaign-concludes-more-than-2000-crore-collected-so-far/articleshow/81255380.cms

No comments