Breaking News

ప్రస్తుత టీకాలు కొత్త స్ట్రెయిన్లపై పనిచేస్తాయా? భారత్ కీలక ప్రయోగాలు


బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో వెలుగుచూసిన కొత్తరకం కోవిడ్ స్ట్రెయిన్‌లు అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. చైనాలో వెలుగుచూసిన కంటే ఇవి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు గుర్తించారు. ఈ కొత్తరకం స్ట్రెయిన్‌ కేసులూ భారత్‌లోనూ వెలుగుచూశాయి. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లు యూకే స్ట్రెయిన్‌పై పనిచేస్తాయని వెల్లడయ్యింది. కానీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లపై ఈ వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ స్ట్రెయిన్‌లపై ప్రస్తుత టీకాల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఇప్పటివరకు సరైన సమాచారం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలపై ఇవి పనిచేస్తాయా? లేదా అనే విషయం శాస్త్రవేత్తల పరిశోధన పూర్తయ్యే వరకు చెప్పడం కష్టమేనని శివ్‌నాడార్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపక్‌ సెహగల్‌ పేర్కొన్నారు. యూకే రకం వైరస్‌లో ఇప్పటివరకు ఒకే మ్యుటేషన్ జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్‌లలో మాత్రం ఇప్పటికే చాలా మ్యుటేషన్లు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఫైజర్‌, మోడెర్నాలు తమ వ్యాక్సిన్‌లకు యూకే, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు ఇటీవల ప్రకటించాయి. ఇక, రష్యా, చైనాలకు చెందిన టీకాలు కొత్త స్ట్రెయిన్‌లపై పనిచేస్తున్నట్టు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లు యూకే స్ట్రెయిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు స్పష్టంచేసినప్పటికీ కొత్తగా గుర్తించిన వేరియంట్‌లపై పరిశోధనలు పూర్తయ్యేవరకూ అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. ప్రస్తుత వ్యాక్సిన్లకు యూకే వేరియంట్‌‌ను తటస్థీకరించే సామర్థ్యం ఉందని, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్‌లపై వీటి ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి అని అన్నారు. ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సంయుక్తంగా సార్స్ కోవి-2 దక్షిణాఫ్రికా వేరియంట్‌ను వేరుచేయడానికి ప్రయోగాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. బ్రెజిల్ వేరియంట్‌ను ఇప్పటికే వేరుచేశారని బలరామ్ భార్గవ్ పేర్కొన్నారు. ‘ఇటీవల దేశంలోకి ప్రవేశించిన రెండు వేరియంట్లను అందుబాటులో ఉన్న టీకాలు తటస్థం చేయగలవా? అనేది ప్రయోగశాలలో పరీక్షలు జరగుతున్నాయి’ అని ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ సమిరన్ పాండా అన్నారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒక వేరియంట్ మరింత ప్రమాదికారిగా మారాల్సిన అవసరం లేదు..వేగంగా వ్యాప్తి చెందుతున్న స్టెయిన్‌తో సంబంధం కలిగి ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలి’ అన్నారు.


By February 18, 2021 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-can-our-vaccine-fight-new-strains-india-to-test/articleshow/81084159.cms

No comments