Breaking News

దేశ స్వావలంబన ప్రయివేటీకరణతోనే సాధ్యం.. నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ


దేశం స్వావలంబన సాధించాలంటే ప్రభుత్వాలు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని పునరుద్ఘాటించారు. శనివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి-ఆయోగ్ పాలక మండలి వార్షిక సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్ధమని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌లో భారత్ విజయం సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్ఫూర్తి ఉండాలని సూచించారు. భారత్‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించాలని మోదీ అన్నారు. ప్రైవేటు రంగ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా సమయంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేశాయని, దీంతో మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశం విజయం సాధించిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లడమే దేశాభివృద్ధికి పునాదని, అదే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని మోదీ స్పష్టం చేశారు. అప్పుడే ఆర్థిక వృద్ధిని కూడా సాధించగలమని ప్రధాని నొక్కిచెప్పారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో దేశం విజయం సాధించిందని, ప్రపంచ దేశాల్లో భారత్‌ తన ఖ్యాతిని మరింత పెంచుకుందని పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌పై దేశమంతా సానుకూలంగా స్పందించడం దేశ ప్రజల మనోభావాలను అద్దం పడుతోందని అన్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని, ఇలాంటి సమయంలో సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదని మోదీ అన్నారు. ముఖ్యంగా యువత అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక పథకాలు ప్రతి ఒక్కరికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. గడిచిన కొన్నేళ్లలో కొన్ని కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు కల్పించామని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా విద్యుత్‌, గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆరోగ్య సదుపాయాలను మెరుగుపర్చడంతో పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా, నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి బెంగాల్, పంజాబ్ సీఎంలు తప్ప మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు నీతి ఆయోగ్‌ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశాల వల్ల ఎటువంటి ఫలితం లేదంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత భేటీలకు గైర్హజరయ్యారు. రాష్ట్రాల ప్రణాళికలకు మద్దతు ఇచ్చే నీతి-ఆయోగ్‌కు ఆర్ధిక అధికారాలు లేవని ఆరోపించారు.


By February 20, 2021 at 02:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/governments-should-back-private-sector-to-make-india-self-reliant-pm-modi/articleshow/81124392.cms

No comments