Breaking News

కశ్మీర్ అంశంపై ఐరాస ప్రత్యేక రిపోర్టర్స్ వ్యాఖ్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్!


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేయడంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్స్ విమర్శలకు భారత్ దీటుగా బదులిచ్చింది. జమ్మూ కశ్మీర్ భారత్‌ అంతర్గత వ్యవహారమని, దీనిని వేరుచేసి చూడలేరని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేయడంపై ఐరాసలో మైనార్టీ అంశాల ప్రతినిధి ఫెర్నాండ్ డే వెరెన్నెస్, మత స్వేచ్ఛ ప్రతినిధి అహ్మద్ షాహీద్‌లు విమర్శలు గుప్పించారు. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వెబ్‌సైట్‌లో ప్రచురించిన పత్రికా ప్రకటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్‌లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తున్న సమయంలో ఈ పత్రికా ప్రకటన విడుదల చేయడం శోచనీయమని అన్నారు. ‘జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే అంశాన్ని పత్రికా ప్రకటన విస్మరించింది.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి, కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ 2019 ఆగస్టు 5న భారత పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది’ అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షతకు ముగింపు పలికి, ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్లకు స్థానిక ఎన్నికల నిర్వహణ, సుపరిపాలన అందజేస్తోన్న విషయాలను విస్మరించారని శ్రీవాస్తవ్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని మిగతా ప్రాంతాల్లో అమలవుతున్న చట్టాలు జమ్మూ కశ్మీర్‌కు వర్తింపజేయడంతో ఇతర ప్రాంతాల వారికి లభించే హక్కులు అక్కడి ప్రజలకు దక్కాయని, ఈ సానుకూల ప్రభావాన్ని ఎలా విస్మరించారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేసి, దేశంలో ముస్లిం, ఇతర మైనారిటీల రాజకీయ భాగస్వామ్యాన్ని తగ్గించగల కొత్త చట్టాలను రూపొందించడానికి భారత్ తీసుకున్న నిర్ణయంపై ఐరాస మానవ హక్కుల నిపుణులు ఆందోళన చెందుతున్నారు అని ప్రతినిధులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఆరోపించారు. మానవ హక్కుల మండలి తప్పనిసరిగా నిష్పాక్షికత, తటస్థత వైఖరికి స్పెషల్ రిపోర్టర్స్ కట్టుబడి ఉండాలని, కానీ వారి ప్రకటన దానికి విరుద్ధంగా ఉందని శ్రీవాస్తవ్ ప్రశ్నించారు. ‘స్పెషల్ రిపోర్టర్స్ వారి పరిశీలనలో ఉన్న సమస్యలపై సరైన అవగాహన పెంచుకుంటారని మేం ఆశిస్తున్నాం, త్వరితగతిన తీర్మానాలకు దిగడం, పత్రికా ప్రకటనలు జారీ చేయడం మానుకోవాలి’ అని ఆయన అన్నారు.


By February 20, 2021 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-rejects-un-special-rapporteurs-over-jammu-and-kashmir-remarks/articleshow/81122326.cms

No comments