Breaking News

మార్స్‌పై నాసా రోవర్ ల్యాండింగ్ వెనుక భారత సంతతి యువతి స్వాతి!


అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన విజయవంతంగా అంగారక గ్రహం (మార్స్) ఉపరితలంపై దిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త తొలిసారి ధ్రువీకరించారు. అత్యంత క్లిష్టమైన వాతావరణం ఉండే ఉపరితలంపై రోవర్ ల్యాండింగ్‌కు చివరి ఏడు నిమిషాలే కీలకం. ఈ గండాన్ని దాటి పెర్స్‌ర్వెన్స్ అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరింది. ‘పెర్స్‌ర్వెన్స్ సురక్షితంగా మార్స్ ఉపరితాలన్ని చేరింది.. ఆ గ్రహం గత జీవిత సంకేతాలను వెతకడం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది’ రోవర్ దిగిన వెంటనే మోహన్ ప్రకటించారు. ఏడు నెలల పాటు ప్రయాణించి విజయవంతంగా రోవర్ లక్ష్యాన్ని చేరడంతో నాసా శాస్త్రవేత్తల్లో సంతోషం వెల్లివిరిసింది. యాటిట్యూడ్ కంట్రోల్, రోవర్ ల్యాండింగ్ వ్యవస్థ అభివృద్ధి విభాగానికి స్వాతీ మోహన్ నాయకత్వం వహించి, చారిత్రాత్మక మిషన్ వెనుక ఉన్న శాస్త్రవేత్తల బృందంలో ఉన్నారు. రోవర్‌ను సరైన దిశలో నడపడానికి యాటిట్యూడ్ కంట్రోల్ సిస్టమ్ కీలకం. అంతరిక్షంలో వాహకనౌక ఎక్కడ ఉందో గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. గత కొన్నేళ్లుగా నాసా చేపట్టిన పలు అంతరిక్ష మిషన్‌లలో స్వాతి మోహన్ భాగస్వామిగా ఉన్నారు. శని గ్రహంపై అధ్యయనానికి నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసిని మిషన్‌కు కూడా పనిచేశారు. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి వీక్షించిన అత్యంత క్లిష్టమైన రోవర్ ల్యాండింగ్ ప్రక్రియ నావిగేట్ చేసి మోహన్ మరోసారి చరిత్ర సృష్టించారు. కర్ణాటకకు చెందిన స్వాతీ మోహన్ ఏడాది వయసున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె బాల్యంలో చాలా ఏళ్లు వర్జీనియా, వాషింగ్టన్ డీసీలో గడిపారు. అమెరికా సైన్స్ ఫిక్షన్ సీరిస్ ‘స్టార్ ట్రెక్’చూస్తూ అంతరిక్ష పరిశోధనలపై మక్కువ పెంచుకున్నారు. స్టార్ ట్రెక్‌కు తొలిసారి తన తొమ్మిదో ఏట చూసిన స్వాతి.. 16 ఏళ్ల వయస్సు వరకు పీడియాట్రీషియన్ కావాలని కోరుకున్నారు. కానీ, తరువాత ఆమె ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుని, అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని కొనసాగించారు. కార్నేల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఎస్ పూర్తిచేసి, ఎంఐటీలో ఎంఎస్, ఏరోనాటిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. నాసా ప్రయోగించిన పెర్స్‌ర్వెన్స్ రోవర్ దాదాపు తొమ్మిది నెలల్లో 472 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది. గంటలకు 19వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి విజయవంతంగా మార్క్ ఉపరితలంపై దిగింది.


By February 19, 2021 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/indian-american-scientist-swati-mohan-behind-nasas-rover-landing-on-mars/articleshow/81105072.cms

No comments