Breaking News

పెళ్లింట విషాదం.. అత్తారింటికి వెళుతూ ప్రమాదంలో నవ వధువు మృతి


కోటి ఆశలతో అత్తారింటికి బయలుదేరిన నవ వధువును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంబడించింది. వివాహమైన మూడు రోజుల తర్వాత ఎంతో సంతోషంగా పుట్టింటి నుంచి భర్తతో కలిసి బయలుదేరిన యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. బిజ్నౌర్ సమీపంలోని నజీబాబాద్ వద్ద కొత్త దంపతులు ప్రయాణిస్తు వాహనాన్ని ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నవవధువు ప్రాణాలు కోల్పోగా.. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బధాపూర్ నివాసి పూజకు ఫిబ్రవరి 16న కిరత్‌పూర్ పరిధిలోని మెచీపురా గ్రామంలో వివాహమైంది. శుక్రవారం పూజాది కార్యక్రమాలు ముగించుకుని భర్త తన్మయ్‌తో సహా బయలుదేరింది. వీరు ప్రయాణిస్తున్న కారును నజీబాబాద్‌లో రాయపూర్ రోడ్డు సమీపంలో ఒక ట్రాక్టర్ ట్రాలీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో వధువు పూజ అక్కడికక్కడే మృతి చెందగా, తన్మయ్ సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి వరుడు తన్మయ్ నడిపినట్టు పేర్కొన్నారు. వివాహం జరిగిన మూడు రోజుల్లోనే నవ వధువును మృత్యువు కబళించడంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనలో గాయపడిన తన్మయ్ సహా మిగతావారిని బంధువులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వరుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ట్రాలీ యజమాని గురించి ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీ తన కారును కుడివైపు నుంచి ఢీకొట్టినట్టు తన్మయ్ తెలిపాడు. తరుచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు తెలిపారు.


By February 20, 2021 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-bride-was-going-to-the-in-laws-house-after-leaving-died-in-accident-at-bijnor/articleshow/81121191.cms

No comments