Breaking News

ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. వైద్యం కోసం వచ్చిన మహిళను ఈడ్చిపారేసిన సెక్యూరిటీ


చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ పట్ల అక్కడ సెక్యూరిటీ గార్డు అత్యంత కర్కశకంగా ప్రవర్తించాడు. మతిస్థిమితం లేని ఆమెను ఆస్పత్రి నుంచి 300 దూరం ఈడ్చుకెళ్లి గేటు బయటకు నెట్టేశాడు. మధ్యలో బురద ఉన్నా అలాగే ఆమెను ఈడ్చుకెళ్లాడు. మానవత్వానికి మాయని మచ్చలాంటి ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్‌ జిల్లా ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అధికారులు స్పందించి.. దారుణానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును తొలగించారు. అయితే ఆమె పట్ల ఎందుకంతా అమానుషంగా ప్రవర్తించాడో చెప్పేందుకు వారు నిరాకరించారు. మతిస్థిమితం లేని మహిళను ఎవరో తీసుకొచ్చి ఆస్పత్రిలో వదిలేసి వెళ్లారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది సూచనలతో గార్డు ఇలా చేసినట్టు తెలుస్తోంది. వైద్యం చేయడానికి ముందుకు రాకపోగా ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖర్‌గోన్ కలెక్టర్ అనుగ్రహ తీవ్రంగా స్పందించారు. బాధితురాలిని గుర్తించి, చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ దివ్యేశ్ వర్మ మాట్లాడుతూ.. ఆమె కసం గాలిస్తున్నామని, తనంతట తానే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిందన్నారు. మతిస్థిమితం లేని ఆమె జిల్లా ఆస్పత్రికి వచ్చి అక్కడ రోగులు, సిబ్బందిపై రాళ్లు విసిరిందని చెప్పారు. సెక్యూరిటీ గార్డు ఆమెను బయటకు పంపినా.. గేటు దగ్గర కూర్చుని రోడ్డుపై వెళ్తున్నవారిని తిడుతూ ఉందన్నారు. అంతేకాదు, మహిళను సెక్యూరిటీ గార్డ్ ఈడ్చుకొచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు తప్పుడవని, అంబులెన్స్ వెళ్లడానికి ఆమెను పక్కకు లాగాడని తెలిపారు. అయితే, కారణం ఏదైనప్పటికీ సెక్యూరిటీ గార్డుపై చర్యలు తీసుకున్నామని వర్మ పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో మహిళ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఖర్‌గోవ్ ఆస్పత్రిలో మానసిక వైద్యుడు లేకపోవడంతో ఆమె ఆచూకీ తెలిసిన తర్వాత ఇండోర్‌కు పంపడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.


By February 21, 2021 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hospital-security-guard-drags-away-mentally-challanged-woman-in-madhya-pradesh/articleshow/81133314.cms

No comments