Breaking News

పుదుచ్చేరి: విశ్వాస పరీక్షలో విఫలం.. సీఎం నారాయణసామి రాజీనామా


గత కొద్ది రోజులుగా పుదుచ్చేరిలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ముగిసింది. బలనిరూపణలో విఫలమవ్వడంతో అధికార కాంగ్రెస్-డీఎంకే కూటమి కూలిపోయింది. నారాయణసామి ప్రభుత్వం బలనిరూపణలో విఫలమైందని స్పీకర్ ప్రకటించారు. అధికార కూటమి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మెజార్టీ 12కి పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఆరుగురు రాజీనామా చేయడంతో 26కి చేరింది . దీంతో బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గాలంటే సాధారణ మెజార్టీకి 14 మంది సభ్యులు అవసరం. కానీ, కాంగ్రెస్‌ బలం స్పీకర్‌తో కలిసి 12కి పడిపోవడంతో బలపరీక్షలో విఫలమయ్యారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు నారాయణసామి ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ నుంచి సీఎం నారాయణసామి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. తన రాజీనామా లేఖను తమిళసై సౌందరరాజన్‌కు అందజేయనున్నారు. అంతకు ముందు సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇచ్చిన ఆదేశాలతో అసెంబ్లీని సమావేశపరిచారు. ఈ సందర్భంగా సీఎం నారాయణసామి మాట్లాడుతూ.. తనకు మెజార్టీ ఉందని, విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, డీఎంకే నేత స్టాలిన్ కారణంగా ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు గురించి సీఎం సభలో ప్రస్తావించారు. తనకు మద్దతుగా సభ్యులు ఓటేయాలని సీఎం కోరారు. ప్రజలు మా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నట్టు స్పష్టమైందని, అన్ని ఉప ఎన్నికల్లోనూ తమ కూటమి గెలిచిందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రలు చేసిందని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండటం వల్లే ఐదేళ్ల పాటు ప్రభుత్వం అధికారంలో ఉందని నారాయణసామి అన్నారు. విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం కుట్రలు పన్నిందని దుయ్యబట్టారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని కూల్చడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని అన్నారు. తాము ప్రతిపాదనలు పంపినా ఎటువంటి నిధులు ఇవ్వకుండా పుదుచ్చేరి ప్రజలకు కేంద్రం ద్రోహం చేసిందని ఆరోపించారు. బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఏప్రిల్-మే నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగున్నాయి.


By February 22, 2021 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/narayanasamy-government-fails-to-prove-majority-in-puducherry/articleshow/81147740.cms

No comments