Breaking News

మనవడి కోసం మేకను బలిచ్చి ఉద్యోగం ఊడగొట్టుకున్న ఎస్సై!


నాగరికత ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కుద్రపూజలు, మూఢనమ్మకాలు, జంతుబలులు కొనసాగుతున్నాయి. తాజాగా, రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీస్ అధికారి అమ్మవారికి మేకను బలిచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. కోట జిల్లా డియోలీ-మాంఝీ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న భన్వర్ సింగ్ ఇటీవల తన మనవడికి కేశఖండన వేడుక నిర్వహించాడు. ఓ ఆలయంలో ఈ వేడుకను నిర్వహించిన ఎస్సై భన్వర్ సింగ్.. అక్కడ అమ్మవారికి ఓ మేకను కూడా బలిచ్చాడు. ఈ సందర్భంగా తన బంధుమిత్రులందరికీ విందు ఏర్పాటు చేశాడు. అయితే, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కోట జిల్లా గ్రామీణ ఎస్పీ శరద్ చౌదరి విచారణకు ఆదేశించారు. ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలిచ్చిన విషయం నిర్ధారణ కావడంతో అతడిని విధుల నుంచి శుక్రవారం తప్పించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారుల నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 19న ఈ ఘటన చోటుచేసుకుంది. బరన్ జిల్లాలోని తన స్వగ్రామం ప్రరద్వాలో ఎస్సై భన్వర్ సింగ్ ఈ వేడుకను నిర్వహించారు. భన్వర్ సింగ్ స్వయంగా మేక మెడకాయ కోస్తున్నట్టు వీడియోలో ఉంది. 54 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను జంతు సంరక్షకులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. బాధ్యతయుతంగా ఉండాల్సిన అధికారి జంతు బలులను ప్రోత్సహించడం బాధాకరమని అన్నారు.


By February 27, 2021 at 03:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sub-inspector-suspended-for-sacrificing-goat-at-family-function-in-rajasthan/articleshow/81243830.cms

No comments