Breaking News

పంచాయతీ ఎన్నికలు: ఒడిశా పిటిషన్‌పై సుప్రీంలో ఏపీ కౌంటర్.. ఏం చెప్పిందంటే?


తమకు చెందిన మూడు గ్రామ పంచాయతీల పేర్లను మార్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను నిర్వహిస్తోందని సుప్రీంకోర్టులో ఒడిశా వేసిన పిటిషన్‌పై ఏపీ అఫిడ్‌విట్ దాఖలు చేసింది. ఆ మూడు పంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవేనని పేర్కొంది. ఈ గ్రామాలు అరకు, సాలూరు నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయని, గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఏపీ ఎన్నికలు నిర్వహించిందని తెలియజేసింది. ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ చేపట్టిన .. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయవాదికి పిటిషన్ కాపీ ఆందజేయాలని, దీనిపై వచ్చేవారం సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. కాగా, ఈ అఫిడ్‌విట్‌పై స్పందించేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వం కోరింది. దీనికి అనుమతించిన జస్టిస్ ఎంఎం ఖన్విల్కర్ ధర్మాసనం.. అనంతరం విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ కౌంటర్ దాఖలు చేశారు. గంజయ్‌బద్ర, పట్టుచెన్నూరు, పగులుచెన్నూరు సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయని అన్నారు. ఇది అరకు పార్లమెంట్ స్థానంలో ఉందన్నారు. 1952 నుంచి ఈ గ్రామాల్లో ఏపీ ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహిస్తోందని, 2006, 2013లోనూ పంచాయతీ ఎన్నికలు జరిగాయన్నారు. ‘గౌరవనీయ న్యాయస్థానం 2006లో అటువంటి విషయాలను నిర్ణయించే అధికార పరిధి తమకు లేదని కచ్చితమైన తీర్పు ఇచ్చింది. అందువల్ల పిటిషన్ చాలా తప్పుగా ఉంది.. కాబట్టి ఒడిశా పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఏపీ అభ్యర్థించింది. గతవారం విచారణ సందర్భంగా ప్రస్తుత ఎన్నికలపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తమ భూభాగంలోని మూడు పంచాయతీలను పేరు మార్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూభాగంలోని గ్రామాల్లో ఎన్నికల నిర్వహిస్తోందని పేర్కొంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కోరాపుట్ జిల్లాకు చెందిన గంజాయ్‌పదర్‌ను గంజాయ్‌భధ్రగా, పట్టుసెనరీని పట్టుచెన్నూరుగా, ఫగలుసెనరీని పగులుచినేరుగా మార్చిందని తెలిపింది. గతంలో తాము ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించామని, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని వివరించింది.


By February 19, 2021 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ap-files-affidavit-in-supreme-court-for-odisha-petition-on-panchayat-elections/articleshow/81105760.cms

No comments