Breaking News

పుల్వామా అమరులకు నివాళి.. వరుడు చేసిన పనికి ఫిదా అయిన జనం


జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న పాకిస్థాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. పక్కా పథకం ప్రకారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను యావత్తు ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. ప్రతి భారతీయుడు రక్తం ప్రతీకారంతో మరిగిపోయింది. విషాదం మిగిల్చిన ఈ ఘటనకు ఆదివారంతో రెండేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ యావత్తు దేశం వారికి ఘన నివాళులర్పించింది. అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఉగ్రవాదులపై ఇంతకు మరింత ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేసింది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోని కరింజియాలో పుల్వామా అమరులకు నివాళులర్పించే సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కరింజియాలోని ఖటిక్ పుర ప్రాంతంలో ఆదివారం రాత్రి 8 గంటలప్పుడు పుల్వామా అమరులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ఎంఐఎం ఏర్పాటుచేసింది. ఇదే సమయంలో ఓ పెళ్లి ఊరేగింపు అటుగా వెళ్తోంది. అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న విషయాన్ని గమనించిన వరుడు సునీల్ ధోకే (26) వెంటనే తన ఊరేగింపును నిలిపివేశాడు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల గౌరవార్ధం ఊరేగింపు ఆపేసి, తను కూడా నివాళులర్పించాడు. ఊరేగింపులో ఉన్నవారిని నిశ్శబ్దంగా ఉండాలని సూచించి, వాహనం దిగి అమరులకు రెండు నిమిషాలు పాటు మౌనం పాటించాడు. దీంతో అమర జవాన్ల పట్ల ఆయన గౌరవానికి అక్కడ ఉన్నవారందరూ ధోక్‌ను మెచ్చుకున్నారు. అతడిపై అభినందనలు కురిపించారు. అక్కడ ఉన్న పోలీసులు సైతం అమరులకు నివాళులర్పించారు. ఈ మొత్తం సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దేశం కోసం పోరాడుతున్న సైనికుల పట్ల ప్రజలకున్న గౌరవం ఇది పొగుడుతున్నారు.


By February 15, 2021 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/groom-pauses-wedding-procession-to-honour-pulwama-martyrs-in-maharashtra/articleshow/80916844.cms

No comments