Breaking News

నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ .. వీడియో వైరల్


ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే రాహుల్ అప్పుడప్పుడు సరదాగా కొన్ని కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తాజాగా స్విమ్మర్‌‌గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి రాహుల్‌ కేరళలోని కొల్లాం తీరంలో బుధవారం పర్యటించారు. వాడి బీచ్ నుంచి మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రంలోకి వెళ్లారు. ఓ పడవలో సముద్రంలోకి వెళ్లిన ఆయన చేపలను పట్టేందుకు వల కూడా విసిరారు. అనంతరం మత్స్యకారులతో పాటు సముద్రంలోకి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు. మధ్యలో హఠాత్తుగా పడవలో నుంచి సముద్రంలో దూకి జాలర్లతో కలిసి ఈతకొట్టారు. దాదాపు పది నిమిషాల పాటు రాహుల్ సముద్రం నీటిలో ఈత కొట్టారు. రాహుల్ ఈత కొట్టిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరితో చెప్పకుండా రాహుల్ ఒక్కసారిగా సముద్రంలోకి హఠాత్తుగా దూకడంతో భయపడినట్లు చెప్పారు కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. పడవ తిరిగి ఒడ్డుకు చేరాక.. థంగస్సెరీ బీచ్‌ దగ్గర మత్స్యకారులను ఉద్దేశించి రాహుల్‌ ఉద్వేగ భరితంగా మాట్లాడారు. కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జాలర్లు ఎంత కష్టపడతారో తనకు ఇవాళ అర్థం అయ్యిందన్నారు. మత్స్యకారుల పనిని తాను ఎంతో గౌరవిస్తాను, ఆరాధిస్తానని తెలిపారు రాహుల్ గాంధీ. చేపలు దొరికితే తామంతా లొట్టలేసుకుంటూ తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్‌లోకి రావడానికి మత్స్యకారులు ఎంత కష్టపడుతున్నారో ఇవాళే తనకు అర్థం అయ్యిందంటూ రాహుల్‌ అన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


By February 25, 2021 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rahul-gandhi-swimming-in-sea-with-fishermen-at-kerala/articleshow/81202109.cms

No comments