Breaking News

నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా.. సాయంత్రం ఈసీ కీలక సమావేశం


పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత బిహార్‌లో ఎన్నికలు జరగ్గా.. ఆ తర్వాత ఐదు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనుండటం ఇదే మొదటిసారి. పశ్చిమ్ బెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 33 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితో పాటు దేశంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్, తెలంగాణ‌లో నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప-ఎన్నిక జరగనుంది. పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపైనే యావత్తు దేశం దృష్టి ఉంది. ఇక్కడ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. బీజేపీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందే బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అటు అసోంలో అధికారాన్ని నిలబెట్టుకోడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇక, 140 స్థానాలున్న కేరళ శాసనసభ గడువు జూన్‌ 1వ తేదీన ముగియనుంది. గత ఎన్నికల్లో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌ ఈ సారి ఎలాగైనా తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ సారి ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తమిళనాడులో అసెంబ్లీ గడువు మే 24తో ముగియనుంది. మొత్తం 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ ఇటీవలే విడదలయ్యారు. దీంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అటు స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే కూడా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనుండగా.. ఇటీవలే కాంగ్రెస్-డీఎంకే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.


By February 26, 2021 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/election-commission-to-announce-poll-dates-for-5-states-at-friday-430-pm/articleshow/81223737.cms

No comments