ఫోన్ సిగ్నల్స్ కోసం మంత్రిగారు తిప్పలు.. 50 అడుగుల ఎత్తులో ఊయల ఏర్పాటు!
మొబైల్ ఫోన్కు సిగ్నల్స్ లేకపోవడంతో ఓ మంత్రిగారు పడిన తిప్పలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోక్లు పేలుతున్నాయి. రోజూ 50 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేసిన ఉయ్యాలలో కూర్చుని మధ్యప్రదేశ్ మంత్రి ఫోన్లో మాట్లాడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ‘డిజిటల్ ఇండియా’పై మీమ్స్ హోరెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ మంత్రి బ్రజేంద్రసింగ్ యాదవ్ అశోక్నగర్ జిల్లా అమ్ఖో గ్రామంలో 50 అడుగుల ఎత్తున ఓ ఉయ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. రోజూ దానిపైకి ఎక్కి అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఎందుకలా? చేస్తున్నారని అని ఆయనను ప్రశ్నిస్తే.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు రోజూ తన వద్దకు వస్తున్నారని, ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. చుట్టూ ఎత్తైన కొండలు ఉండటంతో ఆ గ్రామానికి సిగ్నల్స్ రావడం లేదు. మొబైల్ సిగ్నల్స్ కోసం 50 అడుగుల ఎత్తులో ఉయ్యాలను ఏర్పాటుచేసుకున్నట్టు తెలిపారు. రోజూ అందులో కూర్చుని అధికారులతో మాట్లాడి గ్రామస్థుల సమస్యలు తీర్చుతున్నట్టు మంత్రి చెప్పారు. గ్రామంలో జరుగుతున్న ‘భగవత్ కథ’, ‘శ్రీరామ్ మహాయ జ్ఞ’ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గత తొమ్మిది రోజులుగా ఇక్కడే ఉంటున్నట్టు మంత్రి తెలిపారు. ఇక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసుకున్నట్టు ఆయన చెప్పారు.
By February 22, 2021 at 10:47AM
No comments