Breaking News

పుల్వామా ఘటనకు రెండేళ్లు.. 40 మంది భారత సైనికులు అమరులైన రోజు


జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 14) పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహుతి దాడిలో పాల్గొన్న కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ కూడా హతమయ్యాడు. పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్.. తన కారును జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది.. మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ఆత్మాహుతి దాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే ఉగ్రవాది అదిల్ పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత రగిలిపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. అందుకు మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఎంచుకుంది. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. అయితే, పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్‌ ప్రజల విజయమని ఆదేశ మంత్రి ఫవద్‌ ఛౌధురీ గతేడాది జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేటతెల్లమయ్యింది. ‘భారత్‌ను వారి గడ్డపైనే దెబ్బకొట్టాం. పుల్వామాలో విజయం సాధించాం. ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ విజయం సాధించింది. మనమంతా ఆ విజయంలో భాగస్వాములం’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ వ్యవహారంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ బజ్వా వణికినట్లు ఆ దేశ ప్రతిపక్ష ఎంపీ అయాజ్‌ సాధిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్ధమాన్‌ను విడుదల చేయకపోతే భారత్‌ తమ దేశంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని ఖురేషీ చెప్పినట్లు.. ఆ సమయంలో బజ్వా కాళ్లు వణికినట్లు అయాజ్‌ వెల్లడించారు.


By February 14, 2021 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indians-never-forget-sacrifice-of-crpf-soldiers-on-2nd-anniversary-of-pulwama-terror-attack/articleshow/80904690.cms

No comments