Breaking News

నేటి నుంచే కోవిడ్ టీకా బూస్టర్ డోస్.. 26 రోజుల్లో 77 లక్షల మందికి వ్యాక్సిన్


దేశంలో ఆదివారం (ఫిబ్రవరి 13) నుంచి రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమయ్యింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16న ప్రారంభం కాగా.. తొలి రోజు టీకా తీసుకున్నవారికి 28 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నారు. తొలి రోజున ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తదితర ప్రముఖులు టీకా తీసుకోగా.. బూస్టర్ డోస్‌ను వేసుకుంటారు. ఇప్పటి వరకు 77 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోస్‌ ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. టీకా తీసుకున్నవారిలో 97 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు పేర్కొంది. జులై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా అందజేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 26 రోజుల్లోనే 70 లక్షల మందికిపైగా భారత్ టీకా వేయగా.. ఇదే అమెరికాలో 27 రోజులు, యూకేలో 48 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల వెల్లడించింది. యూపీలో అత్యధికంగా 8.31 లక్షల మందికి టీకా వేయగా.. తర్వాత గుజరాత్ (6,61,508), మహారాష్ట్ర (6,33,519), రాజస్థాన్ (592,412), మధ్యప్రదేశ్ (509,168), కర్ణాటక (490,746), పశ్చిమ్ బెంగాల్ (479,912), బిహార్ (451,621), ఆంధ్రప్రదేశ్ 348,280) తదితర రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 65 శాతానికిపైగా ఆరోగ్యసంరక్షణ సిబ్బంది టీకా వేసుకున్నారు. అత్యధికంగా బిహార్‌లో 79 శాతం మంది ఆరోగ్య సిబ్బంది తొలి డోస్ తీసుకున్నారు. అలాగే, ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 40 శాతం మంది ఆరోగ్య సిబ్బంది టీకా తీసుకోగా.. పుదుచ్చేరిలో అత్యల్పంగా 17.5 శాతం మంది మాత్రమే తొలి డోస్ వేయించుకున్నట్టు తెలిపింది. ఇక, గడచిన 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏటువంటి కరోనా మరణాలు చోటుచేసుకోలేదని పేర్కొంది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ కోవీషీల్డ్ టీకాలను భారత్‌లో అత్యవసర వినియోగం కింద అనుమతించిన విషయం తెలిసిందే.


By February 13, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-vaccine-booster-shot-today-for-those-who-took-1st-dose-28-days-ago/articleshow/80891830.cms

No comments