Breaking News

కమలా హ్యారిస్: అగ్రరాజ్యంలో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం.. అందరి దృషి ఆమెపైనే


అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. అగ్రరాజ్యం చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుండగా.. ఆ వ్యక్తి భారత మూలాలున్న మహిళ కావడం విశేషం. భారతీయ సంతతికి చెందిన మహిళ కావడంతో ప్రతి ఒక్కరి దృష్టి కమలా హ్యారిస్‌పేనే ఉంది. జో బైడెన్‌ హయాంలో ఓ చరిత్రాత్మక పాత్రను కమలా పోషించబోతున్నారంటూ అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఆమెను ఆకాశానికెత్తేసింది. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టడంపై కమలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్ణవివక్షతపై శాంతియుత పోరాటం చేసి, హత్యకు గురైన పౌరహక్కుల నేత, అమెరికా గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ గౌరవార్ధం ఏటా జనవరి మూడో సోమవారం జాతీయ సేవా దినోత్సవంగా పాటిస్తారు. అనకొస్టియాలో మార్టిన్ స్మారకం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పాలన పగ్గాలను చేపట్టడం నూతనాధ్యక్షుడు జో బైడెన్‌కు, తనకు అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. బుధవారం నుంచి తాము చేయాల్సిన పని చాలా ఉంటుందని అన్నారు. ‘వ్యాక్సిన్‌లు వేయించడం, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం, ఉద్యోగులు, కుటుంబాలకు ఉపశమనం కలిగించడం... ఇలా చాలా అంశాలు మా ముందున్నాయి. మావి భారీ లక్ష్యాలు అని కొందరు అంటున్నారు. కష్టపడి పనిచేసి, అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల సహకారంతో దీనిని సాధించగలం’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అమెరికాలో ప్రతి ఆరు కుటుంబాల్లో ఒకటి ఆకలితో ఉన్నాయి. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒకటి అద్దెలు చెల్లించలేకపోతున్నాయి.. బిల్లులు కట్టలేని స్థితిలో మూడోవంతు మంది ఉన్నారు. వీరందరికీ మేం మార్టిన్‌ లూథర్‌కింగ్‌ స్ఫూర్తితో సేవలు అందించాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకారం రోజు హింసాత్మక ఘటనలు చెలరేగవచ్చన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. అమెరికాకు తదుపరి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నాను.. ఇందుకు తలెత్తుకుని సగర్వంగా హాజరవుతానని ఉద్ఘాటించారు. అనంతరం ఆమె ట్విట్టర్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘మన దేశానికి స్వస్థత, పునర్నిర్మాణం దిశగా ఉంది.. అంటే అందుకు మార్గం సులభంగా ఉందని అర్థం కాదు. కాగా, సెనేట్ పదవికి రాజీనామా చేశారు. కాలిఫోర్నియా నుంచి ఆమె సెనేట్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్‌కి సమర్పించారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. స్వస్థలానికి ప్రాతినిధ్యం వహించగలిగిన తాను కాలిఫోర్నియాకు సగర్వ పుత్రికనని చెప్పారు. బృందంతో కలిసి దాదాపు దశాబ్దం పాటు అవిశ్రాంతంగా సేవలందించడం గర్వకారణమన్నారు. ఇదిలా ఉండగా.. జో బైడెన్‌కు ఇప్పటికే 78 ఏళ్లు పూర్తికావడంతో 2024 ఎన్నికల్లో ఆయన పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా బరిలో దిగుతారని, ఆమె కాబోయే అధ్యక్షురాలని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్.. తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. విద్యాభ్యాసం కోసం 1958లో అమెరికాకు వెళ్లి.. జమైకాకు చెందిన డోనాల్డ్ హ్యారిస్‌ను వివాహమాడారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో 1964 అక్టోబరు 20న కమలా హారిస్ జన్మించారు. కమలకు ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆమెను, చెల్లి మాయా హారిస్‌ను తల్లి పెంచిపెద్ద చేశారు. చెల్లెలు మాయాతో కమలాకు అనుబంధం ఎక్కువే. ఆ ముగ్గురినీ కలిపి తెలిసినవాళ్లు 'శ్యామల అండ్ ద గర్ల్స్' అని పిలిచేవాళ్లు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2016లో సెనేట్‌కు ఎన్నికయ్యారు.


By January 20, 2021 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-vice-president-elect-kamala-harris-interesting-comments-on-economy-challenges/articleshow/80358749.cms

No comments