Breaking News

స‌త్యదేవ్‌ ‘గాడ్సే’ హీరోయిన్.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న మలయాళీ బ్యూటీ


వెర్సటైల్ యాక్టర్ స‌త్యదేవ్.. గోపీగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శకత్వంలో ‘గాడ్సే’ మూవీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. సి.కె. స్క్రీన్స్ ప‌తాకంపై ప్రముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బ్లఫ్ మాస్టర్‌’ వంటి క్లాసిక్ మూవీ తర్వాత స‌త్యదేవ్‌, గోపీగ‌ణేష్ ప‌ట్టాభి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్ ప్యాక్‌డ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ‘గాడ్సే’తో మ‌రోసారి అల‌రించేందుకు రెడీ అవుతున్నారు , పట్టాభి. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఐశ్వర్య లక్ష్మి తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో తన అరంగేట్రానికి ‘గాడ్సే’ సరైన చిత్రమని భావించిన ఐశ్వర్య ఇందులో నటించడానికి అంగీకరించారు. ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా పాత్రలో సత్యదేవ్ న‌టిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి కూడా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలో న‌టించబోతున్నారు. ఐశ్వర్యకు తెలుగు ఇండస్ట్రీలోకి స్వాగతం చెబుతూ సత్యదేవ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి గోపీగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శక‌త్వంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. సి.వి. రావు స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. నాజ‌ర్‌, బ్రహ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిషోర్ ఇత‌ర ముఖ్య పాత్రల్లో న‌టించనున్నారు. సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ తదితర సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.


By January 10, 2021 at 03:39PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aishwarya-lakshmi-telugu-debut-with-satya-dev-gopi-ganesh-pattabhi-c-kalyan-movie-godse/articleshow/80198630.cms

No comments