Breaking News

లోన్ యాప్ ప్రతినిధుల వేధింపులు.. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య


పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా... ఎంత మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపినా లోన్ యాప్స్ వేధింపులు ఆగడం లేదు. సులభంగా రుణలిస్తామంటూ ప్రలోభపెట్టి అధిక వడ్డీలతో ప్రజలను జలగల్లా పీడిస్తున్న రుణ సంస్థల వేధింపులు భరించలేక ఇటీవల చాలామంది అమాయకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కోవలోనే తాజాగా రాజన్న జిల్లాకు చెందిన మరో యువకుడు ఆన్‌లైన్ లోన్ యాప్ ప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన మల్లుగారి పవన్‌కళ్యాణ్‌రెడ్డి (22) కరీంనగర్‌లో డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవల కొంత డబ్బు అవసరం ఉండటంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా లోన్ యాప్స్‌ ద్వారా రుణం తీసుకున్నాడు. వారం రోజులు తిరగకముందే అప్పు తీర్చాలంటూ యాప్ ప్రతినిధులు అతడిని వేధించారు. పూచీకత్తుగా నంబర్‌ ఇచ్చిన వ్యక్తికి కూడా వాళ్లు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిసిపోతుందన్న భయంతో కళ్యాణ్ శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.ఈ విషయం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే దృష్టికి వెళ్లడంతో ఆయన స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. లోన్ యాప్స్ ప్రతినిధులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిబ్బందిన ఆదేశించారు. కళ్యాణ్ ఏయే యాప్స్ నుంచి ఎంతెంత రుణం తీసుకున్నాడన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


By January 09, 2021 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-commits-suicide-for-online-loan-app-lenders-harassment-in-sircilla/articleshow/80182099.cms

No comments