Breaking News

అధ్యక్ష హోదాలో ట్రంప్ చివరి ప్రసంగం.. బైడైన్ విజయం గురించి ఏమన్నారంటే?


అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ శకం ముగిసిపోయింది. మరికొద్ది గంటల్లో ఆయన అధ్యక్ష భవనాన్ని ధాన్ని వీడనున్నారు. ఈ సందర్భంగా తన చివరి ప్రసంగాన్ని విడుదల చేసిన ట్రంప్.. ఎక్కడా బైడెన్‌ గెలుపును నేరుగా అంగీకరించలేదు. కేవలం కొత్తగా వచ్చే పాలకవర్గానికి శుభాకాంక్షలు అంటూ సందేశాన్ని ముక్తసరిగా ముగించారు. తన హయాంలో అమెరికా సాధించిన విజయాలను ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ‘అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. ఈవారం కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుంది. అమెరికాను సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంలో వారు విజయం సాధించాలని కోరుకుంటున్నా. వారికి మా శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో అదృష్టమూ వారికి తోడుండాలని ప్రార్థిస్తున్నా’ అని బైడెన్‌ బృందానికి ఆహ్వానం పలికారు. క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడిపై ట్రంప్‌ మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్ని సహించేదిలేదని పునరుద్ఘాటించారు. ‘క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడితో అమెరికా పౌరులు భయభ్రాంతులకు గురయ్యారు. రాజకీయ హింస అనేది అమెరికా విలువలపై దాడి చేయడంతో సమానం. ఇలాంటి ఘటనల్ని ఎప్పటికీ సహించలేం. పార్టీలకతీతంగా మనమంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఉమ్మడి లక్ష్యం కోసం కృషి చేయాలి’ అంటూ ట్రంప్ చిలక పలుకులు పలికారు. చైనా సహా పలు దేశాలతో నెరిపిన దౌత్య విధానం తన హయాంలో సాధించిన విజయాలుగా ట్రంప్‌ చెప్పుకున్నారు. అలాగే పలు దేశాలతో కుదిరిన ఒప్పందాలను కూడా గుర్తుచేసుకున్నారు. ‘అమెరికా నాయత్వాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా బలపర్చాం. యావత్తు ప్రపంచం మళ్లీ మనల్ని గౌరవించడం ప్రారంభించింది. ఆ హోదాను మనం ఎప్పటికీ కోల్పోవద్దు. వివిధ దేశాలతో ఉన్న సంబంధాలను పునరుద్ధరించడంతో పాటు చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యాం.. మధ్య ఆసియాలో అనేక శాంతి ఒప్పందాలకు కృషి చేశాం. ఇవన్నీ జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. గత కొన్ని దశాబ్దాల చరిత్రలో ఎలాంటి యుద్ధాలు ప్రారంభించని తొలి అధ్యక్షుడిగా గర్వపడుతున్నాను’ అని ట్రంప్‌ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఉన్న అమెరికాకు బయటి శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ట్రంప్ హెచ్చరించారు. నిరంతరం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నాయి. అయితే, రానురాను అమెరికా ప్రజలు దేశ గొప్పతనంపై విశ్వాసం కోల్పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదే దేశానికి అన్నింటికంటే పెద్ద ముప్పని.. దేశ సంస్కృతిని కాపాడుతూ దాని ఉనికిని రక్షిస్తేనే దేశ గొప్పతనం ఇనుమడిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనను నిషేధించడాన్ని ట్రంప్‌ పరోక్షంగా ప్రస్తావించారు. వాదోపవాదాలు, చర్చలు, విభేదించడం అమెరికా సంస్కృతిలో భాగమని, అసమ్మతివాదుల గొంతు అణచివేయాలనుకోవడం విలువలకే విరుద్ధమని వ్యాఖ్యానించారు. జవనరి 6న క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ట్రంప్‌ ఖాతాలను నిషేధించిన విషయం తెలిసిందే. ‘మేము ఏం చేయాలని ఇక్కడకు వచ్చామే అంతకంటే ఎక్కువే చేశాం.. కఠినమైన యుద్ధాలు, కష్టతరమైన పోరాటాలు, చాలా కష్టమైన ఎంపికలను చేశాను.. ఎందుకంటే మీరు నన్ను ఎన్నుకున్నారు’ అని అన్నారు. ‘నేను ఈ అద్భుతమైన ప్రదేశం నుంచి నమ్మకమైన, సంతోషకరమైన హృదయంతో.. ఆశావాద దృక్పథంతో.. మన దేశానికి, మన పిల్లలకు మరిన్ని ఉత్తమమైన రోజులు రాబోతున్నాయన్న అత్యున్నత విశ్వాసంతో వెళ్తున్నాను’ అంటూ అధ్యక్షుడిగా ట్రంప్‌ తన చివరి ప్రసంగాన్ని ముగించారు.


By January 20, 2021 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/we-did-what-we-came-here-to-do-donald-trump-says-in-farewell-address/articleshow/80360669.cms

No comments