Breaking News

అదే జరిగితే ప్రతీకారం తప్పదు.. పరోక్షంగా చైనాకు రాజ్‌నాథ్ హెచ్చరిక


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనపై కేంద్ర రక్షణ మంత్రి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరులోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వెటరన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ..భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఒకవేళ ఏదైనా ‘సూపర్‌ పవర్’ భారతజాతి గర్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే దీటుగా జవాబు ఇవ్వగల సత్తా సైన్యానికుందని పరోక్షంగా చైనాను హెచ్చరించారు. ప్రతి ఒక్కరి భద్రతే తమ ధ్యేయమని, పొరుగు దేశాలతో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. శాంతి, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకే తాము ప్రాధాన్యత ఇస్తామని పునరుద్ఘాటించారు. ‘ఇతర దేశాలతో శాంతి, స్నేహపూర్వక సంబంధాలే భారత్ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మన రక్తం, సంస్కృతిలోనే ఉంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి.. భారత సైనికులు అలాంటి సాహసోపేత కార్యకలాపాలు చేపట్టడాన్ని ఎవ్వరూ ఊహించలేరు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయలేను’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు నెలకున్న వేళ సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను ఆయన శ్లాఘించారు. భారత సైనికులు అసమాన ధైర్యం, సహనాన్ని ప్రదర్శించారు.. దానిని నేను వివరిస్తే ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది అని వ్యాఖ్యానించారు. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారు సమాజం, యువతకు స్ఫూర్తినిచ్చేందుకు కీలక పాత్ర పోషించాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ‘ప్రభుత్వం ఇప్పటికే మీకోసం ఎంతో చేసింది. ఇంకెంతో చేయాల్సింది ఉందని నాకు తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే ఒన్ ర్యాంక్ ఒన్ పెన్సణ్ డిమాండ్‌ను నెరవేర్చారు. మాజీ సైనికుల ఆరోగ్య పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొనేలా నామినేట్‌ చేసే అధికారం స్థానిక కమాండర్లకు ఇచ్చాం’ అని ఆయన పేర్కొన్నారు.


By January 15, 2021 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-defence-minister-rajnath-singh-indirectly-strong-message-to-china-on-amid-lac-standoff/articleshow/80277548.cms

No comments