Breaking News

నాన్న గొప్ప హిందూవాది.. అయినా అన్ని మతాలను ఎంతో గౌరవించారు: నేతాజీ కుమార్తె


125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ.. నేతాజీ గురించి ఆయన కుమార్తె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుభాష్ చంద్రబోస్ గొప్ప హిందూవాది అని, అయినా అన్ని మతాలనూ గౌరవించి, సమానంగా చూసేవారని జర్మనీకి చెందిన ఆయన కూతురు అనిత బోస్ ఫాఫ్ అన్నారు. ‘తన అనుచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇండియన్ నేషనల్ ఆర్మీలోని సభ్యులకు ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు.. ఇతర మతాలను గౌరవించాలని చెప్తూనే ఆయన హిందూ మతాన్ని చాలా పటిష్ఠంగా ఆచరించారు’ అని ఆమె పేర్కొన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆమె జర్మనీలోని మ్యూనిచ్‌లో ఉన్న భారత కాన్సులేట్ ద్వారా సందేశం ఇచ్చిన అనిత... ఆ వీడియోను ఇండియన్ కాన్సులేట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘ఐక్యతా, సహనం’ అనే సిద్ధాంతాలనే ఆయన జీవితాంతం అనుసరించారని అనిత గుర్తు చేశారు. ఆలోచనకు, అమలుకు ఆయన ప్రతిరూపం అని వ్యాఖ్యానించారు. ‘ఎల్లప్పుడూ ఆధునిక, ఆనంద భారత్ కోసమే కలలు కన్నారు.. ఇదే సమయంలో చరిత్రలో వేళ్లూనుకుపోయిన సంస్కృతి, జీవనతత్వం, మత సంప్రదాయాలను అనుసరించే ఇండియా కావాలనుకున్నారు’ చెప్పారు. ‘నేతాజీ ఆలోచనలు, సిద్ధాంతాల నుంచి మనమందరం ప్రేరణ పొందగలమని.. ఈ ప్రయత్నాలలో మీకు వందనం.. జై హింద్’ అని ముగించారు. కాగా, బోస్ మనవడు, మాజీ ఎంపీ, నేతాజీ రిసెర్చ్ బ్యూరో ఛైర్మన్ సుగతా బోస్ మాట్లాడుతూ.. ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ ఇవ్వడం కంటే అన్ని కులాలు, వర్గాలను ఏకం చేసే నేతాజీ, గాంధీజీ ఆదర్శాలను అనుసరించడం చాలా ముఖ్యం అన్నారు. ‘ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆయన జన్మదినానికి మనం ఎలా పేరు మార్చాలో కాదు ... వ్యక్తిగతంగా, పరాక్రామ్ దివస్ అనే పదాన్ని నేను ఎక్కువగా ఇష్టపడను.. దేశనాయక్ దివస్‌ను ఎక్కువగా ఇష్టపడతాను’ అని పేర్కొన్నారు. నేతాజీ జయంతి వేళ శనివారం కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లో ఉన్న బోస్ నివసించిన ఇంటిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన తర్వాత సుగతా బోస్ ఈవ్యాఖ్యలు చేశారు.


By January 24, 2021 at 01:49PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/netaji-subhas-chandra-bose-was-devout-hindu-but-respected-all-faiths-daughter/articleshow/80432811.cms

No comments