కారు డ్రైవర్ ముసుగులో కీచకుడు.. మహిళల ఫోటోలు మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్

అమాయకుడిలా కనిపిస్తాడు. పెళ్లయిన మహిళలతో పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా మెలుగుతూ ఫోటోలు దిగుతాడు. ఆ తర్వాత వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలు సోషల్మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడతాడు. అతడి బారిన పడిన బాధితులు ఫిర్యాదు చేయడంతో జిల్లా పోలీసులు ఆ ఘరానా మోసగాడి భరతం పట్టారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం పైపల్లి గ్రామానికి చెందిన బి.వి.మధు అలియాస్ వసంత్ కుమార్రెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన కారు ఎక్కే వివాహిత మహిళలను ఎంచుకుని మభ్యపెట్టి రహస్యంగా ఫొటోలు తీసేవాడు. వాటిని నగ్నంగా మార్ఫింగ్ చేసి వారికి పంపి బెదిరింపులకు పాల్పడేవాడు. దీనికి తోడు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఈ క్రమంలోనే అతడి చేతిలో మోసపోయిన ఓ మహిళ రొంపిచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మధుపై కేసు నమోదు చేసిన పోలీసులు తమిళనాడులోని వేలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉండగా బుధవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, ఓ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలమనేరు, తవణంపల్లె, ఐరాల, రొంపిచెర్ల పోలీస్స్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి బారిన పడి వేధింపులకు గురైన మహిళలు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలు రహస్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
By January 01, 2021 at 10:24AM
No comments